AP News: బొలెరో వాహనంలో కదులుతూ కనిపించిన మూటలు.. ఏంటా అని చెక్ చేయగా..

| Edited By: Ram Naramaneni

Aug 31, 2024 | 12:33 PM

అల్లూరి జిల్లా లక్కవరం ఫారెస్ట్ రేంజ్‌ సుకుమామిడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 278 తాబేళ్లను అధికారులు పట్టుకున్నారు. వీటిలో 33 తాబేళ్లు మృతి చెందగా, 245 ప్రాణాలతో ఉన్నాయన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో తాబేళ్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అరుదైన వన్యప్రాణులను బోర్డర్లు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు స్మగ్లర్లు. తాజాగా పెద్ద సంఖ్యలో తాబేళ్లను రెస్క్యూ చేశారు అటవీ శాఖ అధికారులు. చింతూరు మండలం సుకుమామిడి వద్ద తనిఖీలు చేస్తుండగా… AP20AD3789 నంబర్‌ బొలెరో వాహనం అటుగా వచ్చింది. అందులోని వ్యక్తులు కంగారుగా కనిపించడంతో.. వాహనంలో చెక్ చేయగా.. నిండుగా ఉన్న 8 గోనె సంచులు ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా తాబేళ్లు దర్శనమిచ్చాయి. మొత్తం 278 తాబేళ్లను అధికారులు రెస్క్యూ చేశారు.

చింతూరు మండలం పొల్లూరుకు చెందిన కార్తీక్ మండల్, కోరుకొండ సమీపంలోని జగన్నాధపురంకి చెందిన బలిన సాయి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు అమలాపురం నుంచి ఒడిస్సాకి తాబేళ్లు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి.. బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ తాబేళ్లలో 33 మృతి చెందగా సజీవంగా ఉన్న 245 తాబేళ్లు శబరి నదిలోకి వదిలిపెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow us on