తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో వాతావరణ శాఖ 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులపాటు పొడి వాతావరణంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తకువగా నమోదవుతాయని అంచనా వేసింది.
ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్, హైదరాబాద్, నాగర్కర్నూల్, జగిత్యాల, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. గత 24 గంటల్లో కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది.ఈ తీవ్రమైన చలి గాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి ప్రభావం వల్ల కేవలం జలుబు, దగ్గు మాత్రమే కాకుండా.. రక్తపోటు పెరగడం, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఈ సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని చెబుతున్నారు. చలి నుంచి రక్షణ పొందడానికి ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మఫ్లర్లు, సాక్సులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :