తిరుమలలో కోడిగుడ్డు కలకలం వీడియో

Updated on: Jan 23, 2025 | 2:32 PM

తిరుమల కొండలు నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతాయి. వేసే అడుగు.. తీసే అడుగు అన్నట్టుగా నిత్యం వెంకటేశ్వరుడి స్మరణలోనే ఉంటారు. చివరకు చెడు మాట్లాడటానికి కూడా భక్తులు ఇష్టపడరు. ఏడు కొండలపై కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తి ముసుగులో అన్యమత ప్రచారానికి పాల్పడినవారు కొందరైతే.. అపవిత్రం చేసేవారు మరికొందరు.దేవాలయాలకు వెళ్లేటప్పుడు నియమ నిష్టతో వెళ్తారు. తాజాగా తమిళనాడుకి చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుపతిలో దిగిపోయారు. అక్కడి నుంచి మెట్ల మార్గంలో తిరుమలపైకి నడిచి వెళ్లారు.

అయితే వస్తూ వస్తూ ఆ భక్తుల టీమ్.. కోడి గుడ్లు, పలావ్‌తో అక్కడికి చేరుకుంది. రాంభగిచా బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ ఆరగించడాన్ని గుర్తించారు కొందరు శ్రీవారి భక్తులు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది.. భక్తుల దగ్గర ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమంటూ భక్త బృందాన్ని పోలీసులు మందలించారు. అయితే తిరుమలలో మాంసాహారం తినకూడదన్న విషయం తెలియక తెచ్చుకున్నట్లు భక్తులు తెలిపారు. దీంతో తమిళ భక్తులకు దీనిపై అవగాహన కల్పించి వదిలేశారు పోలీసులు. తమిళనాడుకు చెందిన ఈ భక్తులు తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం మాత్రం తీవ్ర కలకలం రేపింది.

Published on: Jan 23, 2025 02:32 PM