రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో
అది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ.. చీకటి పడితేచాలు ఇక్కడి ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు…కొన్ని రోజులుగా ప్రతిక్షణం భయంభయంగా గడుపుతున్నారు. రాత్రంతా కాపలా కాస్తున్నారు. అసలేం జరిగింది? ప్రజలు ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? ఎందుకు రాత్రంతా కాపలా కాస్తున్నారు? చీకటి పడితేచాలు ఇళ్ల పై రాళ్ల శబ్దాలతో వణికిపోతున్నారు ఆ ప్రాంతవాసులు…
గత కొన్ని రోజులుగా రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు ఇండ్లపై రాళ్లు, మట్టి పెళ్లలు పడుతున్నాయి. ఏ ఇంటి పై కప్పులపై చూసినా రాళ్ల కుప్పలు కనిపిస్తున్నాయి.. అంతేకాదు, ఆ కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, ముగ్గులతో కొబ్బరి కాయలు కొట్టి, దీపం వెలిగి ఉంటుంది. ఇది చూసి తట్టుకోలేక వారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళంవేసి వలస వెళ్లిపోయారు. ఐతే ఏదో శక్తి కాలనీని ఆవహించిందని దెయ్యమో.. భూతమో.. తమను పగబట్టిందా.. లేక ఎవరైనా చేతబడి చేశారా అని ఆందోళనచెందుతున్నారు. ఈసమస్యనుంచి తమకు విముక్తి కల్పించండని పోలీసులు, మున్సిపల్ అధికారులకు స్థానికులు మొర పెట్టుకుంటున్నారు.