కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..

Updated on: Feb 25, 2025 | 2:29 PM

ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి నిద్రలేమి. చాలా మంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఫలితంగా శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్య సమస్యలతో పాటు ఒత్తిడి, పనిపై సరిగా దృష్టిపెట్టలేక పోవడం వంటి వివిధ ప్రాబ్లమ్స్​ను ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు ఛాటింగ్, వెబ్‌ సీరీస్‌ అంటూ కాలక్షేపం చేస్తూ నిద్రపోవడం లేదు. కేరళలో ఓ వృద్ధుడు రాధాకృష్ణ కురూప్‌కి కొత్త సమస్య వచ్చిపడింది. ఈ మధ్య కాలంలో ప్రశాంతమైన నిద్ర లేదు.

తెల్లవారుజామున 3 గంటలైతే చాలు.. ఎంత గాఢనిద్రలో ఉన్నా గంట కొట్టినట్లు లేచి కూర్చొంటున్నారు. కారణం.. పొరుగింటి వారు పెంచుతున్న కోడిపుంజులు. కేరళలోని పథనంథిట్ట జిల్లా పల్లికల్‌ గ్రామవాసి అయిన రాధాకృష్ణ ఇంటి పక్కనే అనిల్‌కుమార్‌ నివసిస్తున్నారు. అనిల్‌ ఇంట్లో పెంచుకొంటున్న కోడిపుంజులు ప్రతిరోజు తెల్లవారుజాము 3 గంటలకు కొక్కొరోక్కో అంటూ కూతలు మొదలుపెడతాయి. ఈ వ్యవహారం రెండిళ్ల మధ్య వివాదానికి దారి తీసింది. ఇక లాభం లేదని అడూర్‌ ఆర్డీవో కార్యాలయంలో రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు. అధికారుల బృందం ఆ రెండిళ్లను పరిశీలించింది. పై అంతస్తులో అనిల్‌ కోడిపుంజులను పెంచుతున్నారని, పొరుగింటికి ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమేనని వారు నివేదిక ఇచ్చారు. దీంతో అనిల్, రాధాకృష్ణలను పిలిచి చర్చించిన ఆర్డీవో పై అంతస్తులో ఉన్న పౌల్ట్రీ షెడ్డును ఇంటికి దక్షిణం దిక్కుకు మార్చాలని అనిల్‌ను ఆదేశించారు. ఇలా మార్చేందుకు అతడికి 14 రోజులు గడువిచ్చారు.