పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నిర్మల్ జిల్లాలో చిరుత పులుల సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన 24 గంటల్లో వేర్వేరు ప్రాంతాల్లో రెండు చిరుతలు జనం కంటపడటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఖానాపూర్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా నుంచి తర్లపాడు వెళ్లే మార్గంలో శనివారం రాత్రి ఒక చిరుత రోడ్డు దాటుతుండగా ప్రయాణికులు గుర్తించారు.
కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో ఈ దృశ్యాలను బంధించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే, ఖానాపూర్ మండలం దిలావర్పూర్ శివారులోని బొక్కలగుట్ట వద్ద మరో చిరుత ప్రత్యక్షమైంది. ఓ రైతు తన పంట పొలంలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి.ఒకే రోజు రెండు చిరుతలు కెమెరాలకు చిక్కడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు తర్లపాడు, దిలావర్పూర్ గ్రామస్తులను, ముఖ్యంగా రైతులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చీకటి పడ్డాక బయటకు రావద్దని సూచించారు.ఇటీవల జరిపిన జంతు గణనలో చిరుతల సంఖ్య భారీగా పెరిగినట్టు సమాచారం. పెంబి అటవీ ప్రాంతంలో మాంసాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆహారం, నీటి కోసం ఇవి అడవి దాటి జనావాసాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పొలాలకు వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.