ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..

Updated on: Feb 02, 2026 | 1:46 PM

కూచికాయలపూడి రైతు అడుసుమిల్లి దాసు మరణానంతరం నేత్ర, దేహదానం చేశారు. తన జీవితం ముగిసినా నలుగురికి ఉపయోగపడాలన్న ఆయన గొప్ప కోరిక సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆయన నేత్రాలతో ఇద్దరు అంధులకు చూపు రాగా, దేహం వైద్య విద్యార్థుల శిక్షణకు తోడ్పడింది. మారుమూల గ్రామానికి చెందిన సామాన్య రైతు చేసిన ఈ విశేషమైన దానం ఆయన గొప్ప ఆలోచనలకు, సామాజిక సేవకు అద్దం పడుతోంది.

ఆయనో సాధారణ రైతు.. మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి. పేరు పెద్దగా వినిపించకపోవచ్చు.. కానీ అతని ఆలోచన మాత్రం ఎంతో గొప్పది. తన జీవితం ముగిసిన తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడాలని కోరుకున్నాడు. తన దేహం వృథాగా మట్టిలో కలిసిపోకుండా ఎవరికైనా మేలు చేస్తే చాలని ముందే కుటుంబ సభ్యులకు చెప్పాడు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కూచికాయలపూడి గ్రామానికి చెందిన రైతు అడుసుమిల్లి దాసు వయసు 75 సంవత్సరాలు. గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. జీవితమంతా పొలంలో శ్రమిస్తూ సాధారణ రైతుగా జీవించిన దాసు.. చివరి వరకు సాదాసీదా జీవితమే గడిపారు. అయినా ఆయన మనసు మాత్రం ఎంతో పెద్దది. తన మరణాంతరం దేహదానం చేయాలన్న కోరికను ఆయన ముందుగానే తన భార్య పిల్లలకు స్పష్టంగా చెప్పారు. తను చనిపోయాక తన దేహం మట్టిలో కలిసిపోకుండా ఎవరికైనా ఉపయోగపడితే చాలు అన్న ఆ రైతు మాటలు ఇప్పుడు గ్రామంలో ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్నాయి. దాసు ఆశయాన్ని గౌరవిస్తూ కుటుంబ సభ్యులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది గ్రామానికి వచ్చి ఆయన రెండు కార్నియాలను స్వీకరించారు. దీంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఏర్పడింది.. అలాగే మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్య కళాశాల సిబ్బంది ఆయన సంపూర్ణ దేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం తీసుకెళ్లారు. ఒక సాధారణ రైతు చేసిన ఈ దానం భవిష్యత్తులో ఎంతోమంది వైద్యులకు ఉపయోగపడనుంది. ఈ విషయం గ్రామంలో తెలిసిన వెంటనే కూచికాయల పొడి గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు. దాసు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆశయాన్ని నెరవేర్చిన కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు, స్థానికులు అభినందించారు.. మరణాంతరం కూడా సమాజానికి ఉపయోగపడిన వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పించారు. సాధారణంగా పల్లెల్లో ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో దాసు తీసుకున్న నిర్ణయం మరింత ప్రత్యేకంగా నిలిచింది. చిన్న గ్రామానికి చెందిన సాధారణ రైతు అయినా ఆలోచనలో మాత్రం ఎంతో ఉన్నతంగా నిలిచారు. జీవితం ముగిసినా.. తన నిర్ణయంతో మరికొందరి జీవితాలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా అడుసుమిల్లి దాసు గ్రామ చరిత్రలో నిలిచిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘కంటైనర్‌’ వెనక ఇంత కథ ఉందా ??

అమెరికాలో ‘గోల్డ్‌’ స్కామ్.. మోసపోయింది ఎవరు అంటే

బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి సమయమా ??

సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??

కేంద్ర బడ్జెట్‌ వేళ.. ఈసారి నిర్మలమ్మ శారీ ప్రత్యేకత ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us