రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
వైద్యుడిని 'దేవుడు' అని ఎందుకు అంటారో నిరూపించే ఘటన కేరళలో జరిగింది. ఆసుపత్రి లేదు.. ఆపరేషన్ థియేటర్ లేదు.. కనీసం వైద్య పరికరాలు కూడా లేవు.. కానీ ఒక ప్రాణం కళ్లముందే కొట్టుమిట్టాడుతోంది. ముగ్గురు డాక్టర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. నడిరోడ్డునే ఆపరేషన్ థియేటర్గా మార్చేశారు. మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులో ఎమర్జన్సీ సర్జరీ చేసి, ఒక వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు.
ఎర్నాకులంలో డాక్టర్ థామస్, ఆయన భార్య డాక్టర్ దిడియా చర్చికి వెళ్తుండగా.. పేరూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడాన్ని చూసారు. ఒక బైక్, స్కూటర్ ఢీకొని రోడ్డు మీదే కొందరు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తల నుంచి రక్తస్రావం అవుతుండటంతో బాధితుడికి ఊపిరి అందక విలవిల్లాడాడు. బ్రెయిన్ కు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే కొద్ది క్షణాల్లోనే బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. డాక్టర్లు… స్థానిక ప్రజలు, పోలీసుల సాయంతో బాధితుడికి రోడ్డు పక్కనే అత్యవసర చికిత్స చేసారు. మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్లను వెలుతురుగా వాడుకుంటూ.. కేవలం నాలుగు నిమిషాల్లోనే ప్లాస్టిక్ స్ట్రా, షేవింగ్ బ్లేడ్తో సర్జరీ పూర్తి చేసి బాధితుడు ఊపిరి తీసుకునేలా చేసారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ గుండెలను హత్తుకునే ఘటనను.. కేరళ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ మంచి పని చేశారంటూ డాక్టర్లను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించి ప్రాణాలు కాపాడిన డాక్టర్లను రాజకీయ నేతలు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం :
