సరస్సులో 18 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ శిలాజాలు
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా మరోసారి డైనోసార్ల కాలం నాటి ఆనవాళ్లతో వార్తల్లో నిలిచింది. ఓ సరస్సు వద్ద జరిపిన తవ్వకాల్లో డైనోసార్ యుగానికి చెందినవిగా భావిస్తున్న కొన్ని శిలాజ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రంగంలోకి దిగటంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
జైసల్మేర్కు 45 కి.మీ దూరంలోని మేఘా గ్రామంలో బుధవారం ఓ సరస్సు వద్ద తవ్వకాలు జరుపుతుండగా, స్థానికులకు కొన్ని వింత ఆకారంలో ఉన్న రాళ్లు కనిపించాయి. వాటిలో పెద్ద ఎముకను పోలిన నిర్మాణాలు, శిలాజంగా మారిన కలప వంటి వస్తువులు ఉండటంతో వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సరస్సు వద్ద ఎముకల్లాంటి ఆకారాలు, రాళ్లపై కొన్ని ముద్రలు కనిపించాయని, ఇవి పురాతనమైనవిగా అనిపించడంతో పురావస్తు శాఖకు, జిల్లా అధికారులకు తెలిపామని శ్యామ్ సింగ్ అనే స్థానిక నివాసి వెల్లడించారు. వెంటనే ఫతేహ్గఢ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆ శిలాజాలను పరిశీలించారు. ఈ అవశేషాలను పరిశీలించిన జియాలజిస్ట్ నారాయణ్ దాస్ ఇంఖియా, ప్రాథమికంగా ఇవి డైనోసార్ శిలాజాలు కావచ్చని అభిప్రాయపడ్డారు. ఇవి మధ్యస్థ పరిమాణంలో ఉన్నాయని, శాస్త్రీయ పరీక్షల తర్వాతే కచ్చితంగా చెప్పగలమన్నారు. జైసల్మేర్ ప్రాంతంలోని రాతి పొరలు 18 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జురాసిక్ యుగానికి చెందినవని, ఆ కాలంలోనే డైనోసార్లు జీవించాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని జీఎస్ఐ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ శిలాజాల వయసును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించనున్నారు. జైసల్మేర్ ప్రాంతంలో డైనోసార్ల ఆనవాళ్లు లభించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. గతంలో ఇక్కడ డైనోసార్ ఎముకలు, పాదముద్రలు, 2023లో ఓ డైనోసార్ గుడ్డు కూడా లభ్యమయ్యాయి. తాజా ఆవిష్కరణ కూడా నిర్ధారణ అయితే, ఈ ప్రాంతం పురావస్తు పరిశోధనలకు మరింత కీలక కేంద్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎస్.. భార్యంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!
తాతను ఏం మాయ చేసావే.. 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల! ఏం చేశారంటే