గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్

Updated on: Feb 17, 2025 | 2:13 PM

రైల్వే స్టేషన్లోకి రైలొచ్చింది. రైలెక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు . రైల్వే సిబ్బంది, ఓ వైద్యుడు వెంటనే సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి కోలుకున్నాడు. అయితే, కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలు అక్కడున్న వారిని షాక్‌కు గురి చేశాయి. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఫిబ్రవరి 4న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా మీడియా కథనం ప్రకారం.. హునాన్ ప్రావిన్స్ లోని ఛాంగ్ షా రైల్వే స్టేషన్ లో 40 ఏళ్ల వ్యక్తి రైలు ఎక్కేందుకు క్యూలో ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు.

రైల్వే స్టేషన్ సిబ్బందితో పాటు ఓ డాక్టర్‌ వెంటనే అక్కడికి చేరుకుని సీపీఆర్ చేశారు. దీంతో కాసేపటికి ఆ ప్రయాణికుడు కళ్లు తెరిచాడు. నెమ్మదిగా కళ్లు తెరిచిన ఆ వ్యక్తి.. తాను వెంటనే ఆఫీసుకు వెళ్లాలని, హైస్పీడ్ ట్రైన్ అందుకోవాలని చెప్పడంతో వైద్యుడితో పాటు చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అలాంటి పరిస్థితిలో కూడా ఆఫీసుకు వెళ్ళాలని ఆ వ్యక్తి ఆత్రుత చెందడం చూసి అక్కడున్న వారంతా కదిలిపోయారు. అతని కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ఇలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వెంటనే ఆఫీసుకు వెళ్లాలని ఎందుకంటాడు? అంటూ జాలిపడ్డారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని బాధితుడికి ప్రయాణికులు సర్దిచెప్పారు.