పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి అంటే పచ్చని పందిళ్లు, మంగళ వాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలం ఉండాలి. కానీ, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. పెళ్లి విందులో 'మద్యం' ఏర్పాటు చేయలేదన్న కోపంతో కొందరు అతిథులు ఏకంగా వధూవరులపైనే దాడికి తెగబడ్డారు. పవిత్రమైన పెళ్లి వేడుక కాస్తా రసాబాసగా మారడంతో ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
గ్వాలియర్ జిల్లా పటాయ్ గ్రామానికి చెందిన మహేష్ జాతవ్కు మార్చి 31న వివాహం జరిగింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి చేరుకున్నారు. పెళ్లిలో జరగాల్సిన కొన్నికార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, వేడుకకు హాజరైన కొందరు పొరుగువారు అసలు రచ్చ మొదలుపెట్టారు. తమకు మద్యం ఎందుకు ఏర్పాటు చేయలేదని వరుడు మహేష్తో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో తమకు తక్షణం మద్యం ఏర్పాటు చేయాలని, లేదంటే మందు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి అంటూ సదరు అతిథులు వరుడిని డిమాండ్ చేశారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వరుడు దానికి నిరాకరించడంతో గొడవ ముదిరింది. చిన్నగా మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెళ్లికొడుకు మహేష్, పెళ్లి కుమార్తెతో పాటు ఇరువైపుల కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వధూవరులను కూడా వదలకుండా అతిథులు దాడి చేయడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం మద్యం కోసం ఒక పవిత్రమైన కార్యాన్ని రణరంగంగా మార్చడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!