నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల బంగారం రేటు బాగా పెరిగడంతో ఒంటరి మహిళలే టార్గెట్గా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక్క గోల్డ్ తోనే ఆగడంలేదు. తాజాగా ఇంటిముందు కట్టేసిన మూగజీవాలను కూడా ఎత్తుకెళ్లిపోతున్నారు దుండగులు. తాజాగా హైదరాబాద్లోని షాహీన్ నగర్లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఆటోలో షాహీన్నగర్కు వచ్చారు. రోడ్డు పక్కన కట్టేసి ఉన్న ఓ మేకను గమనించిన వారు చాకచక్యంగా దానిని విప్పి, ఎవరూ చూడనట్లు తమ ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మొత్తం ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. చోరీ జరిగిన తీరును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై బాధితుడు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఘటనపై స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఇలా దొంగతనాలు జరుగుతున్నాయంటే, రాత్రి వేళ భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.