ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుస మరణాలతో భయపడిన ప్రజలు ‘కాల కీడు’ తొలగుతుందనే నమ్మకంతో ఇళ్లకు తాళాలు వేసి గ్రామ శివారుకు వెళ్లి ‘కీడు వంటలు’ నిర్వహించారు. రోజంతా అక్కడే గడిపి సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈ ఘటన మూఢనమ్మకాలపై మరోసారి చర్చకు దారితీయగా, శాస్త్రీయ దృక్పథంతో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
ఆధునిక కాలంలోనూ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. వరుసగా సంభవిస్తున్న మరణాలతో భయపడిపోయిన జమ్మికుంట ప్రజలు.. ఊరంతా ఖాళీ చేసి ‘కీడు వంటల’కు వెళ్లిన విచిత్ర ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. పట్టణ ప్రాంతమైనప్పటికీ పల్లెటూరి ఆచారాలను నమ్ముతూ కాలనీవాసులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట 13, 14వ వార్డుల పరిధిలో ఇటీవల వివిధ కారణాలతో సుమారు పదిమంది మృతి చెందారు. దీంతో కాలనీల్లో తీవ్ర ఆందోళన, భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామ పెద్దలు ఒక పురోహితుడిని సంప్రదించగా, ఊరికి “కాల కీడు” సోకిందని తెలిపాడు. దానికి పరిహారంగా ఆదివారం తెల్లవారుజామునే ఇళ్ల ముందు పేడకళ్లాపి చల్లకుండా, ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి వెళ్లాలని సూచించారు. పురోహితుడి మాటలతో భయపడిన ప్రజలంతా తెల్లవారుజామున 5 గంటలకే ఇళ్లు ఖాళీ చేసి గ్రామ శివారుకు చేరుకున్నారు. రోజంతా అక్కడే వంటలు చేసుకుని తిని, సాయంత్రం చీకటి పడిన తర్వాతే తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈ కీడు వంటల వల్ల ఊరిపై ఉన్న దోషం తొలగిపోతుందని వారు బలంగా నమ్ముతున్నారు. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మూఢనమ్మకాలను నమ్మడం కంటే, వరుస మరణాలకు గల శాస్త్రీయ కారణాలను గుర్తించాలని పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు కోరుతున్నారు. ఇలాంటి ఆచారాలపై అధికారులు ప్రజల్లో తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
