మాయీ మమతానంద్‌ గిరిగా…మమతా కులకర్ణి!వీడియో

Updated on: Feb 19, 2025 | 7:23 PM

కొన్నేళ్ల క్రితం సినిమాలకు గుడ్‌బై చెప్పేసి విదేశాలకు వెళ్లిపోయిన బాలీవుడ్‌ నటి మమతాకులకర్ణి ఇటీవల కుంభమేళాలో సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా సన్యాసినిగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కిన్నార్‌ అఖడా ద్వారా సన్యాసం తీసుకొని మహామండలేశ్వరి హోదాను దక్కించుకున్నారు. ఆ తర్వాత అఖాడా నుంచి పలువురు... మమతాకులకర్ణికి మహామండలేశ్వర్‌ మోదాను ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో ఆమెను అఖాడానుంచి బహిష్కరించారు. ఈక్రమంలో మమత.. మహామండలేశ్వర్‌ హోదాకు రాజీనామా చేశారు. ఈ రాజీనామాను కిన్నార్‌ అఖాడా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె మహామండలేశ్వర్‌ హోదాలోనే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని నటి ఓ వీడియో ద్వారా వెల్లడించారు

జనవరి 24న ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారారు మమతా కులకర్ణి. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలోని కిన్నార్‌ అఖాడాలో ‘మాయీ మమతానంద్‌ గిరి’గా ఆమెకు నామకరణం చేశారు .అఖాడాలో కులకర్ణి చేరిక తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. అఖాడాలో చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్‌ హోదాను పొందడాన్ని పలువురు వ్యతిరేకించారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడటం.. మహామండలేశ్వర్‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజీనామా చేస్తున్నట్లు ఫిబ్రవరి 10న ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఇకపై సాధ్విగా కొనసాగుతానని మమతా కులకర్ణి తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మమతా కులకర్ణి ఓ వీడియో విడుదల చేశారు. ‘మహామండలేశ్వర్‌గా నా రాజీనామా ఆమోదం పొందలేదని, ఆచార్య లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠీ తనను అదే హోదాలో ఉంచినందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. మమతా కులకర్ణి అదే హోదాలో కొనసాగుతారని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠీ పీటీఐకి తెలిపారు.