భారీగా ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు

Updated on: Oct 10, 2025 | 3:47 PM

ఢిల్లీ-కోల్‌కతా హైవే పై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. బిహార్‌లో గత నాలుగు రోజులుగా ఏకంగా 65 కిలోమీటర్ల పొడవునా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోవడంతో డ్రైవర్లు, ప్రయాణికులు తిండి, నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి తలెత్తింది.

నేషనల్ హైవే -19 పై ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో తాత్కాలిక సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేశారు. అయితే కుండపోత వర్షాలకు వరద నీటిలో ఆ రోడ్లు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి, నీరు నిలిచిపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంటగంటకు పెరిగిపోతోంది. రోహ్‌తాస్ జిల్లాలో మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు నిలిచిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాహనాలు 24 గంటల్లో కేవలం 5 కిలోమీటర్లు కూడా ముందుకు కదలడం లేదు. గత 30 గంటల్లో తాము కేవలం 7 కిలోమీటర్లే ప్రయాణించామని, టోల్, రోడ్ ట్యాక్స్‌లు అన్నీ కడుతున్నా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని, ఇక్కడ NHAI సిబ్బందిగానీ, స్థానిక అధికారులుగానీ కనిపించడం లేదని ఓ ట్రక్కు డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ట్రాఫిక్‌లోనే ఉన్నాం. తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నామని, రెండు మూడు కిలోమీటర్లు దాటడానికే గంటలు పడుతోందని మరో డ్రైవర్ వాపోయారు. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయల వంటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, పర్యాటక వాహనాలు, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక యంత్రాంగం గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫస్ట్ టైం లాటరీ టికెట్ కొని.. పాతిక కోట్లు గెలిచిన పెయింటర్

రైలు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. రైలు టికెట్లు రద్దు చేయాల్సిన పనిలేదు