భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
అనుమానితుడైన భర్తతో కాపురం చేయలేక విడాకుల నోటీసు పంపిందో భార్య. దానిని జీర్ణించుకోలేకపోయిన సదరు భర్త, భార్యను నడిరోడ్డుమీద తుపాకీతో కాల్చి చంపేసాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని సేలం జిల్లా కు చెందిన బాలమురుగన్ , భువనేశ్వరి ప్రేమించుకున్నారు. 2011లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాలమురుగన్ గతంలో ఓ ప్రైవేటు ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. భువనేశ్వరి యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై బాలమురుగన్ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
అయినా భర్త వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితం భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఇల్లు తీసుకుని రహస్యంగా ఉంటోంది. అయితే, భార్యపై కక్ష పెంచుకున్న బాలమురుగన్ ఆమె ఎక్కడ ఉందో ఆరా తీసి, నాలుగు నెలల క్రితమే ఆమె నివసించే ప్రాంతానికి సమీపంలోనే అద్దెకు దిగాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భార్య నుంచి విడాకుల నోటీసు అందడంతో బాలమురుగన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో భువనేశ్వరి బ్యాంక్ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, ఆమె కోసం అప్పటికే మాటు వేసిన బాలమురుగన్ తన వద్దనున్న పిస్టల్తో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మరిన్ని వీడియోల కోసం :
