ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్​లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..

Updated on: Feb 25, 2025 | 2:44 PM

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం త్వరలో కనువిందు చేయబోతుంది. టెలిస్కోప్ లేకుండానే ఏడు గ్రహాలను ఒకేసారి చూసే అవకాశం రానుంది. వాటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. 'ప్లానెట్ పరేడ్​'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం కానుంది. అంతకంటే ముందే జనవరిలోనే భారత దేశంలో ఈ ప్లానెట్ పరేడ్​కనువిందు చేసింది. కానీ అప్పుడు ఆరు గ్రహాలు మాత్రమే కనిపించాయి.కోట్లాది మంది భక్తుల రాకతో మహాకుంభమేళా ఘాట్లు కన్నుల పండువగా కనిపించాయి. ఆ కుంభమేళా ముగిసిన తర్వాత సైతం ఆ కన్నుల పండువ కొనసాగనుంది. ఈసారి నేలపై కాకుండా వినీలాకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. అదే సౌరమండలంలోని ఏడు గ్రహాల సాక్షాత్కారం.

 ఫిబ్రవరి 28న ఇవి ఆకాశంలో ఒకే లైన్‌లో కనిపిస్తాయి. ఎంత స్పష్టంగా కనిపిస్తాయంటే సౌరకుటుంబంలోని ఐదు గ్రహాలను నేరుగా మనం కంటితోనే చూడొచ్చు. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలను లేకుండానే చూడొచ్చు. కానీ నెప్ట్యూన్, యురేనస్​ను టెలిస్కోప్ ద్వారా మాత్రమే స్పష్టంగా చూడటం సాధ్యం అవుతుంది. అందుకే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌ దగ్గర ఉంచుకోవాలి. వాటి సాయంతో ఈ రెండింటిని చూడొచ్చు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే సూర్యగమన పథ మార్గంలోనే ఈ అన్ని గ్రహాలను మనం ఒకేసారి చూడొచ్చు. మహాకుంభమేళా వంటి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకుని పూర్తిచేసుకుంటున్న వేళ గ్రహాలన్నీ సాక్షాత్కారం కావడం అనిర్వచనీయ అనుభూతిని ఇస్తుందని కొందరు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహకూటమిని విశేషంగా భావిస్తారు. భారత్‌లో రాత్రి వేళ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను నేరుగా చూడొచ్చు. ఇలా ఎక్కువ గ్రహాలు ఒకేసారి మహాకుంభమేళా కాలంలో దర్శనమివ్వడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ మరింత తేజోవంతమవుతుందని కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు.