Telangana: లక్ష మెగావాట్ల కరెంట్ అవసరం.. 2047 నాటికి తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే..

Updated on: Nov 29, 2025 | 1:22 PM

తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భట్టి తెలిపారు. 2047 నాటికి లక్ష మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరమని అంచనా వేశారు. రాష్ట్రం ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని, భవిష్యత్ అవసరాలు, పర్యావరణ ఒప్పందాల దృష్ట్యా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ డిమాండ్‌ను తీర్చడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ ఉంటేనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమని భట్టి నొక్కి చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఒకేసారి 10 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్‌గా మారబోతోందని చెప్పారు. తెలంగాణను 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రతి ఏడాది విద్యుత్ వినియోగంలో 10 శాతం డిమాండ్ పెరుగుతుందని భట్టి అన్నారు. ఈ లెక్కన 2047 వరకు రాష్ట్రానికి లక్ష మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 24,769 మెగావాట్లుగా ఉందని.. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోకపోతే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు వస్తాయని భట్టి హెచ్చరించారు. పర్యావరణ ఒప్పందాలను ప్రస్తావిస్తూ, గ్రీన్ ఎనర్జీ వినియోగంపై భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. 2030 వరకు విద్యుత్ వినియోగంలో 50 శాతం గ్రీన్ ఎనర్జీ ఉండాలని పారిస్ అగ్రిమెంట్ చెబుతోందని.. 2070 వరకు పూర్తిగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించాలని అంతర్జాతీయ ఒప్పందం ఉందని చెప్పారు. అయితే సోలార్, థర్మల్, విండ్, స్టోరేజ్ వంటి అన్ని గ్రీన్ ఎనర్జీ విభాగాలలో తెలంగాణ వెనుకబడి ఉందని భట్టి విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Nov 29, 2025 01:21 PM
Loading...
Unable to load recommendations.
Follow Us