ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది

Updated on: May 01, 2026 | 7:09 PM

పదో తరగతి ఫలితాల భయంతో సాయిప్రియ ఆత్మహత్య చేసుకుంది. తీరా ఫలితాలు వచ్చాక ఆమె 480 మార్కులతో అత్యుత్తమ గ్రేడ్ సాధించినట్లు తెలిసింది. కేవలం వారం రోజుల ఓపిక లేకపోవడంతో ఆమె జీవితం విషాదంగా ముగిసింది. పరీక్షల ఒత్తిడి, మార్కుల భయం విద్యార్థుల ప్రాణాలను ఎలా బలిగొంటుందో ఈ ఘటన తెలియజేస్తుంది. పిల్లలకు ధైర్యం చెప్పి, మార్కులే జీవితం కాదని తల్లిదండ్రులు బోధించాలి.

ఫలితాల రోజు ఆ ఇంట్లో పండగ ఉండాలి.. మిఠాయిలు పంచుకోవాలి.. కూతురి విజయాన్ని చూసి ఆ తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో మెరవాలి. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అత్యుత్తమ మార్కులతో పాసైన కూతురి మార్కుల పత్రాన్ని చూస్తూ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఫెయిల్ అవుతాననే భయంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. తీరా ఫలితాలు వచ్చాక ఆమె సాధించిన విజయం చూసి ఊరంతా కన్నీరు మున్నీరవుతోంది. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసింది. అయితే, పరీక్షలు రాసినప్పటి నుండి ఆమెలో ఒకటే ఆందోళన.. తాను సరిగా రాయలేదని, కచ్చితంగా ఫెయిల్ అవుతానని మదనపడేది. ఆ భయం ఆమెను ఎంతగా కుంగదీసిందంటే, ఫలితాలు రావడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఏప్రిల్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సాయిప్రియ స్నేహితులు, ఉపాధ్యాయులు ఆమె హాల్‌టికెట్ నంబర్‌తో ఫలితాలను చూడగా, వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిప్రియ కేవలం పాస్ అవడమే కాదు, ఏకంగా 480 మార్కులతో అత్యుత్తమ గ్రేడ్ సాధించింది. ఈ విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు మరింతగా శోకసంద్రంలో మునిగిపోయారు. “ఆ ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే ఈరోజు మా కళ్ల ముందు ఆనందంగా ఉండేది కదా” అంటూ బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. సాయిప్రియ మరణం నేటి విద్యా వ్యవస్థకు, తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. పరీక్షల్లో మార్కులే జీవితం కాదని, ఒక్క పరీక్ష ఫెయిల్ అయితే జీవితం ముగిసిపోదని పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చదువు ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులను కాపాడుకోవడానికి మానసిక ధైర్యం కల్పించడం అత్యవసరమని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క వారం రోజులు ధైర్యంగా ఉండి ఉంటే, సాయిప్రియ ఈరోజు తన విజయాన్ని చూసి మురిసిపోయేది. కానీ, ఇప్పుడు మిగిలింది కేవలం ఆ మార్కుల కాగితం.. తీరని శోకం మాత్రమే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్‌ ట్విస్ట్‌

వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ

Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్

దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక

Follow Us