గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ‘ఇమ్యునోథెరపీ’..

Updated on: Feb 07, 2026 | 9:50 AM

రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ గర్భస్థ పిండాల గుండె సమస్యలకు ఇమ్యునోథెరపీని విజయవంతంగా అందించింది. తల్లిలోని ఆటోఇమ్యూన్ యాంటీబాడీల వల్ల పిండం గుండె దెబ్బతినే ప్రాణాపాయ స్థితిలో, ఐదుగురు శిశువులకు ఈ అత్యంత క్లిష్టమైన చికిత్సను అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఈ అరుదైన విజయం JACC నివేదికలో ప్రచురితమై, రెయిన్‌బోను ప్రపంచ వైద్య చిత్రపటంలో నిలిపింది. ఇది సాధారణ చికిత్స కాదు, తల్లికి తీవ్ర వ్యాధి ఉన్నప్పుడు ప్రత్యేక నిఘాలో మాత్రమే చేయబడుతుంది.

వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. గర్భంలో ఉన్న పిండం గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన ‘ఇమ్యునోథెరపీ’ చికిత్సను విజయవంతంగా అందించి, రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచ వైద్య చిత్రపటంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ చికిత్సను నేరుగా పిండానికి అందించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురు శిశువులను కాపాడటంలో వైద్య బృందం విజయం సాధించింది. గతంలో గర్భస్రావం జరిగిన చేదు అనుభవం ఉన్న 29 ఏళ్ల మహిళ, గర్భధారణతో రెయిన్‌బో ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షల అనంతరం, పిండం గుండె పంపింగ్ సరిగా లేదని, గుండె చప్పుడు అత్యంత తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఈ దశలో చికిత్స అందించకపోతే గుండె వైఫల్యంతో పిండం మరణించే ప్రమాదం ఉంది. దీనిని సవాలుగా తీసుకున్న మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం, అత్యాధునిక ఇమేజింగ్ వ్యవస్థను ఉపయోగించి నేరుగా పిండానికే ‘ఇమ్యునోథెరపీ’ చేపట్టింది. ఈ అరుదైన ప్రక్రియ తర్వాత గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా, సదరు మహిళ ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చారు. తల్లిలోని స్జోగ్రెన్స్ సిండ్రోమ్ లేదా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల యాంటీబాడీలు తల్లి నుండి పిండానికి చేరుతాయి. ఇవి పిండం గుండెపై దాడి చేసి, పనితీరును దెబ్బతీస్తాయి. తల్లిలో ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల దీనిని గుర్తించడం కష్టమవుతుందని, ఇది చివరకు గుండె వైఫల్యానికి దారితీస్తుందని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్వేతా బఖ్రు వివరించారు. ఇప్పటివరకు 21 నుంచి 27 వారాల గర్భధారణ కాలంలో ఉన్న ఐదుగురు మహిళలకు ఈ చికిత్స అందించారు. అసాధారణంగా పెరిగిన ఉమ్మనీరు సమస్యను పరిష్కరిస్తూ, గుండె పంపింగ్‌ను మెరుగుపరిచి, ఐదుగురు శిశువులు ఆరోగ్యంగా జన్మించేలా చేశారు. ఈ విజయవంతమైన చికిత్స వివరాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన JACC (Journal of the American College of Cardiology) నివేదికలో ప్రచురితమయ్యాయి. డాక్టర్ భార్గవి ధూళిపూడి స్పందిస్తూ.. ఇది సాధారణ చికిత్స కాదని, తల్లికి వ్యాధి తీవ్రత ఉండి, శిశువుకు ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యేక నిఘా మధ్య ఈ చికిత్స చేస్తామని వివరించారు. డాక్టర్ నాగేశ్వరరావు కోనేటి స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధక సంబంధిత పిండం గుండె జబ్బుల నిర్వహణలో అనుభవమున్న అతికొద్ది సంస్థల సరసన రెయిన్‌బో చేరిందన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి