‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

Updated on: May 08, 2026 | 12:28 PM

2026లో 'సూపర్ ఎల్ నినో' రాబోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది 1877 నాటి తీవ్ర కరువులను తలపిస్తూ, ప్రపంచ వాతావరణం, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. భారత్‌లో రుతుపవనాలు బలహీనపడి, వ్యవసాయం, నీటి నిల్వలపై ప్రభావం పడుతుంది. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ముందస్తు హెచ్చరికలతో విపత్తును సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంది.

వాతావరణంలో అతి త్వరలో ఊహించని పెను మార్పులు రాబోతున్నాయా? 150 ఏళ్ల క్రితం కోట్లాది మందిని బలితీసుకున్న ఆ ‘చీకటి రోజులు’ మళ్లీ రాబోతున్నాయా? అవునంటున్నాయి వాతావరణ శాస్త్రవేత్తల తాజా హెచ్చరికలు. 2026 మే మొదటివారంలో ‘ఎల్‌ నినో’ ఎంట్రీ ఇచ్చేసింది. ఇది సూపర్‌ ఎల్‌ నినోగా మారబోతోంది. కేవలం ఉష్ణోగ్రతలను పెంచడమే కాదు, గ్లోబల్ ఎకానమీని కూడా కుదిపేసే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే భారత్ ఈ ముప్పును ఎలా ఎదుర్కోబోతోంది? చూద్దాం. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. మే 6వ తేదీన ‘ఎల్‌ నినో’ పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్‌కాయిస్ అధికారికంగా ప్రకటించింది. మే మాసంలోపూ ఎల్‌ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందట. ఎల్‌నినో పరిస్థితులు 2027 జనవరి వరకు అంటే దాదాపు రెండున్నరేళ్లు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం ఉష్ణోగ్రతల్లో మార్పులు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌నూ కలవరపెడుతున్నాయి. శాస్త్రవేత్త ర్యాన్ మాయూయీ 2026లో ఎల్‌ నినో కాస్తా అత్యంత శక్తివంతమైన ‘ సూపర్‌ ఎల్‌ నినో’ గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిని 1877లో సంభవించిన భయంకరమైన ఎల్‌ నినోతో పోల్చారు. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా కరువుకాటకాలు వచ్చి, సుమారు మూడు నుండి 4 శాతం జనాభా మరణించారు. 2015లో కూడా ఎల్ నినో ప్రతాపం చూపింది. తాజా విశ్లేషణల ప్రకారం 2026లో కూడా అలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎల్‌ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. 2023లో ఎల్‌ నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గింది. దీనివల్ల వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు దెబ్బతిని కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఎల్‌ నినో జనవరి 2027 వరకు కొనసాగనుంది. దాంతో అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ సాగుపై కూడా ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు 40 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. వర్షాలు తగ్గితే తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. ఎల్‌ నినో వల్ల కేవలం వర్షాలే తగ్గడం కాకుండా, ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన సముద్రపు వేడిగాలులు ఏర్పడతాయని ఇన్‌కాయిస్‌ తెలిపింది. ఇవి సముద్ర జీవజాలానికి, పర్యావరణ సమతౌల్యానికి పెద్ద ముప్పు కానున్నాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కే ప్రక్రియనే ఎల్‌ నినో. దీనివల్ల ప్రపంచవ్యాప్త గాలి దిశలు, వర్షపాత పద్ధతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. వర్షాలు తగ్గి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుత అంచనా ప్రకారం ఈసారి ఎల్‌ నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలో సగటు కంటే ఎక్కువ వేడి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటలపై, వాతావరణంపై తీవ్ర ప్రభావం పడి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. 1877 లో వచ్చిన ఎల్‌ నినో సమయంలో సరైన సాగునీటి సౌకర్యాలు, వాతావరణ ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల కోట్లాది మంది ఆకలితో మరణించారు. అయితే 2015లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. ఆధునిక నీటిపారుదల వ్యవస్థలు, వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలు, ప్రభుత్వాల అప్రమత్తత వల్ల ప్రాణనష్టం అవకాశం చాలా తక్కువ. 1877లో జరిగింది.. మానవ తప్పిదాల వల్ల సంభవించిన విపత్తు అయితే, 2015లో వాతావరణ పరమైన సవాళ్లు ప్రపంచాన్ని వెంటాడాయి. 2026లో మహారాష్ట్ర, కర్ణాటక లోని వర్షాధారిత ప్రాంతాలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మెరుగైన సాగునీటి ప్రాజెక్టులు ఉండటం వల్ల కొంత ఊరట లభించనుంది. ఎల్‌ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడితే ఆహార ధరలు పెరగడం, గ్రామీణ పరపతి రంగంపై ఒత్తిడి పడటం ఇతర ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ నినో కేవలం ఆహార సంక్షోభమే కాకుండా, వడగాలులు, తుపానులు, ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. ఇది గ్లోబల్ సప్లై చైన్‌పై ప్రభావం చూపి, ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. ఏదిఏమైనప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకలి చావుల వంటివి సంభవించే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు 2015లో వచ్చిన భయంకరమైన ఎల్‌ నినోను తలపించేలా ఉన్నాయని, ఇది ‘సూపర్ ఎల్‌ నినో’గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇండియన్ ఓషన్ డైపోల్ కనుక సానుకూలంగా ఉంటే, ఎల్‌ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ “హీరో” ఈ ఎలుక !!

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్‌ !!

ఉబెర్‌ డ్రైవర్‌ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్‌!

Follow Us