మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

Updated on: Feb 01, 2026 | 4:15 PM

క్రయోజెనిక్స్‌ అనేది మరణించిన దేహాలను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలో భద్రపరిచే ప్రక్రియ, భవిష్యత్తులో సైన్స్‌ పునరుజ్జీవింపజేస్తుందని ఆశతో. లిక్విడ్‌ నైట్రోజన్‌లో -196°C వద్ద దేహాలు/మెదళ్లను నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియకు కోట్లలో ఖర్చవుతుంది. అమెరికా, రష్యాలో ఇది ప్రాచుర్యం పొందినా, పూర్తి మానవ శరీర పునరుజ్జీవం ఇంకా శాస్త్రీయంగా సాధ్యం కాలేదు, కేవలం చిన్న అవయవాల వరకే విజయం లభించింది.

మరణం అనేది జీవనానికి చివరి అంకమే. అయితే సాంకేతికతపై అపారమైన నమ్మకం ఉన్న కొంతమంది ఈ భావనకే సవాల్‌ విసురుతున్నారు. ఈ రోజు కాకపోయినా వందల వేల ఏళ్ల తర్వాతైనా సైన్స్‌ మళ్లీ బ్రతికించగలదన్న ఆశతో తమ శరీరాలను భద్రపర్చుకుంటున్నారు. ఈ విధానమే క్రయోజెనిక్స్‌. సాధారణంగా ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరికొంతమంది వైద్య పరిశోధనల కోసం తమ దేహాలను దానం చేస్తారు. కానీ కొంతమంది అత్యంత ధనవంతులు మాత్రం మరణించిన తర్వాత తమ శరీరాలను లేదా మెదడును అత్యాధునిక క్రయోజెనిక్స్‌ చాంబర్లలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టించి భద్రపర్చుకుంటూ భవిష్యత్‌పై ఆశలు పెంచుకుంటున్నారు. క్రయోజెనిక్స్‌ అనేది శాస్త్రీయ ప్రక్రియ. మరణించిన వెంటనే, శరీరాన్ని అత్యంత వేగంగా మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో లిక్విడ్‌ నైట్రోజన్‌లో గడ్డకట్టిస్తారు.ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటే, కణజాలంలో ఎలాంటి రసాయన మార్పులూ జరగవు. ఈ ప్రక్రియలో రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్‌ అనే ద్రవాన్ని ప్రవేశపెడతారు. కణాలు దెబ్బతినకుండా, శరీరం లేదా మెదడును ‘కాలం నిలిపిన’ స్థితిలో భద్రపరుస్తారు. లిక్విడ్‌ నైట్రోజన్‌లో ఉన్న శరీరానికి కాలంతో సంబంధం ఉండదు. కణజాలం పాడయ్యే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఇలా వందల, వేల ఏళ్లు భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి శరీరం భద్రపర్చాలంటే భారతీయ కరెన్సీలో రూ.1.60 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు, మెదడు మాత్రమే భద్రపర్చాలంటే రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుందని అంచనా. అమెరికా, రష్యా దేశాల్లో ఇందుకోసం ఇన్సూరెన్స్‌ కంపెనీలు కవరేజ్‌ కూడా కల్పిస్తుండటం విశేషం. ఇప్పటికే 500 మందికి పైగా మరణానంతరం తమ శరీరాలు, మెదడును ఈ క్రయోజెనిక్స్‌ చాంబర్స్‌లో భద్రపర్చుకున్నారు. క్రయోజెనిక్స్‌ పై వైద్య పరిశోధనా సంస్థలు అధ్యయనాలు చేస్తున్నాయి. క్రయోజెనిక్స్‌ రంగంలో అమెరికా, రష్యా ముందున్నాయి. మెదడును గడ్డకట్టించిన తర్వాత జ్ఞాపకాలు, నాడి సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం సాధ్యం కాదని కాలిఫోర్నియా వర్సిటీ అధ్యయనంలో తెలిసింది. చిన్న అవయవాల పునరుద్ధరణ వరకే విజయం సాధ్యమైందని, పూర్తి మానవశరీర పునరుద్ధరణ ఇంకా సాధ్యం కాలేదని తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా క్రయోజెనిక్‌ పేషెంట్లు ఉన్న దేశంగా అమెరికా రికార్డుల్లోకెక్కింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు

వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..

శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా

తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో