డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు..చేతులు కలిపిన దిగ్గజ సంస్థలు!
మొబైల్ యూజర్లను సైబర్ మోసాల నుంచి బయటపడేసేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, టెక్ దిగ్గజం గూగుల్ చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక కీలక ఒప్పం కుదుర్చుకున్నాయి. కోట్లాది మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు సురక్షితమైన, అత్యాధునిక మెసేజింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ను, గూగుల్ యొక్క రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్లాట్ఫామ్తో అనుసంధానించడం ద్వారా స్పామ్ మెసేజ్లు, సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయనున్నారు.
ఈ ఒప్పందంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు ‘గూగుల్ మెసేజెస్’ యాప్ ద్వారా హై-క్వాలిటీ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడంతో పాటు మెసేజ్ రియాక్షన్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు. అయితే, వినోదం కంటే భద్రతకే ఇరు సంస్థలు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్ ఫిల్టర్లను ఉపయోగించి హానికరమైన లింక్లను, అనుమానిత సందేశాలను ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. వ్యాపార సంస్థల నుండి వచ్చే మెసేజ్ల విశ్వసనీయతను టెలికాం ఐడెంటిటీ ద్వారా ధృవీకరిస్తారు. దీనివల్ల వినియోగదారులు ఏది అసలైన మెసేజ్, ఏది ఫేక్ అనేది సులభంగా గుర్తించవచ్చు. అలాగే ‘డూ నాట్ డిస్టర్బ్’ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ అనవసరపు స్పామ్ను నిరోధిస్తారు. ఈ సందర్భంగా కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. టెలికాం స్థాయి భద్రతను ఆధునిక మెసేజింగ్కు విస్తరించడమే తమ లక్ష్యమని గూగుల్ ప్రతినిధి సమీర్ సమత్ తెలిపారు. ఇరు సంస్థలు తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో భారతీయ మొబైల్ వినియోగదారులు ఇకపై మరింత ధీమాగా డిజిటల్ సేవలను వాడుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :