రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి "అభయం" హెల్మెట్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి చొరవతో, హెల్మెట్ లేనివారికి 48 గంటలపాటు తాత్కాలికంగా హెల్మెట్లు అందిస్తారు. ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడటమే ఈ కార్యక్రమ లక్ష్యం. 2027 నాటికి శ్రీకాకుళాన్ని 'జీరో యాక్సిడెంట్' జిల్లాగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇది రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో, రాష్ట్రంలోనే తొలిసారిగా “అభయం” పేరుతో ‘హెల్మెట్ బ్యాంకులు’ ఏర్పాటు చేశారు. జరిమానాల కంటే అవగాహన ముఖ్యం అనే దృక్పథంతో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా జిల్లా కేంద్రంలోని మిల్లు జంక్షన్, డే & నైట్ జంక్షన్, బలగ ప్రాంతాల్లో ఈ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడే వాహనదారులకు మొదట అవగాహన కల్పిస్తారు. అనంతరం, ఈ బ్యాంకు నుంచి తాత్కాలికంగా ఉచితంగా హెల్మెట్ను అందిస్తారు. వాహనదారులు తాము తీసుకున్న హెల్మెట్ను 48 గంటల్లోపు తిరిగి అప్పగించాలి. ఆ లోపు సొంతంగా హెల్మెట్ కొనుగోలు చేసినట్లు పోలీసులకు చూపించాల్సి ఉంటుంది. గడువులోగా హెల్మెట్ ఇవ్వకపోతే జరిమానాలు లేదా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను కూడా అమలు చేయనున్నారు. మే నెలాఖరు నాటికి ఆమదాలవలస, పలాస, టెక్కలి సహా జిల్లా వ్యాప్తంగా మరో 10 హెల్మెట్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో ఏటా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో 62 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళనకరమని, 2027 నాటికి శ్రీకాకుళాన్ని ‘జీరో యాక్సిడెంట్’ జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయమని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బైక్ ర్యాలీతో ఘనంగా ప్రారంభించారు. హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించే గ్రామాలను ‘అభయ గ్రామాలు’గా గుర్తించి, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. “హెల్మెట్ మీకు రక్షణ కవచం – మీ కుటుంబానికి అభయం” అన్న నినాదంతో సాగుతున్న ఈ ప్రచారంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడే ఈ వినూత్న ఆలోచన, జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్
పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు
Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్..!
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు