Andhra Pradesh: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. పోలవరంపై కీలక కామెంట్స్

Updated on: Jul 27, 2024 | 8:06 PM

ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై ఆయనతో సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని పాటిల్‌ను చంద్రబాబు కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నీతి ఆయోగ్‌ భేటీలో పాల్గొన్న తర్వాత…ఆయన కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి…తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని బాబు కోరినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను ఆమోదించాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను చంద్రబాబు కోరు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ చేసిన చంద్రబాబు…వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారన్నారు. కేంద్రాన్ని పాత బకాయిలే అడిగామని, కొత్తగా ఏదో ఇచ్చారంటూ రాజకీయం చేయడం సరికాదన్నారు బాబు. గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్‌…ఇష్టారాజ్యంగా కేంద్రం నిధులను దారి మళ్లించిందని, ఇదే విషయాన్ని కేంద్రంలోని ఆయా శాఖలు చెబుతున్నాయన్నారు. నవంబర్‌ నాటికి పోలవరం నిధులు విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   

Loading...
Unable to load recommendations.
Follow Us