ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోదావరి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కొద్దిరోజుల క్రితం వరకు జనసేనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపించిన ముద్రగడ వర్గం ఇప్పుడు రూటు మార్చింది. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానిస్తారని.. ఆయన జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగకపోవడంతో.. ముద్రగడ వర్గం ఆగ్రహంగా ఉంది. ముద్రగడ వర్గంతో చర్చలు జరిపిన జనసేన నేత బన్నీ వాసుతో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జనసేనలో చేరేది లేదని క్లారిటీ ఇచ్చేసింది.జనసేనలో చేరడానికి నో చెప్పిన ముద్రగడ వర్గంతో వైసీపీ చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముద్రగడ వైసీపీలోకి వస్తే కాపులపై అది ఎంతగానో ప్రభావం చూపిస్తుందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అంతేకాదు.. పవన్ పోటీ చేయాలనుకుంటున్న పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో కూడా వైసీపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.