డబుల్ డెక్కర్ రైళ్లకు కేంద్రం పచ్చజెండా..పట్టాలపైకి ఎప్పటి నుంచో తెలుసా?

Updated on: Jan 26, 2025 | 3:06 PM

ఇప్పటి వరకూ సరుకు రవాణాకు, ప్రయాణికులకు వేర్వేరుగా రైళ్లను నడుపుతూ వస్తున్న భారత రైల్వే ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులను, సరకును ఒకేసారి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో డబుల్‌ డెక్కర్‌ రైళ్లను అందుబాటులోకి తేనుంది. ఈ రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ గతేడాది సమర్పించిన డిజైన్‌కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. రైల్వే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఈ డిజైన్‌ను రూపొందించింది.

ఈ డబుల్ డెక్కర్ రైలు కింది భాగాన్ని సరుకు రవాణాకు, పై అంతస్తును ప్రయాణికులకు ఉపయోగిస్తారు. దీనివల్ల సరుకు రవాణాలో వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. కార్గో రవాణా ద్వారా మరింత ఆదాయం పొందేందుకు డబుల్ డెక్కర్ రైళ్లు దోహదం చేస్తాయని రైల్వే భావిస్తోంది. ఈ డబుల్‌ డెక్కర్‌ రైళ్లో 18 నుంచి 22 కోచ్‌లు ఉంటాయి. కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. ఒక్కో కోచ్‌ నిర్మాణానికి రూ. 4 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికే ఈ రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2023-24లో రైల్వే 1,591 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. 2030 నాటికి దీనిని 3 వేల మిలియన్ టన్నులకు పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకు డబుల్ డెక్కర్ రైళ్లు దోహదపడతాయని రైల్వే భావిస్తోంది.