Big News Big Debate: క్లీన్ స్వీప్ నినాదం వెనుక వ్యూహమేంటి..? 34 సీట్లలో గెలుపు సాధ్యమేనా..?

Updated on: Jun 29, 2023 | 6:57 PM

ఏపీ రాజకీయాల్లో వారాహి టూరుతో హీట్‌ రాజుకుంది. రెండు వారాలుగా ఉభయగోదావరి జిల్లాలోనే పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ స్పీడు పెంచి అధికారపార్టీపై విమర్శలు డోసు పెంచారు. వైసీపీ నుంచి రియాక్షన్స్ కూడా అంతే వేగంగా వస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చూడాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బింగ్‌ ఆర్టిస్టులా పవన్‌ మాట్లాడుతున్నారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు.

జనసేన వారాహి యాత్రతో ఏపీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ సరికొత్త నినాదం వినిపిస్తున్నారు. రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటీ వైసీపీ గెలవకూడదంటున్నారు. ఇదే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని కేడర్‌కు పిలుపునిస్తున్నారు. పార్టీకి బలమైన కేడర్‌, లీడర్లు ఉండటంతో వారితో మమేకం అవుతున్నారు పవన్‌. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలతో సమావేశాలు పెట్టి మరీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు పార్టీ కోసం కష్టపడి పనిచేయలేనివారు, భయపడేవారు స్వచ్చందంగా తప్పుకుంటే మంచిదని కూడా చెబుతున్నారు. కేసులకు కూడా భయపడకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లను మాత్రమే ప్రోత్సహిస్తామంటున్నారు. బీమవరం వంటి చోట్ల జనసేన గెలిచితీరాలని ఆదేశిస్తున్నారు.

Follow Us