పవన్ వర్సెస్ పోసాని మధ్య వార్ కొనసాగుతోంది. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో పోసాని ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు రావడంతో.. మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన పోసాని చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే పోసానిపై ప్రెస్ క్లబ్ ముందు పవన్ ఫ్యాన్స్ దాడికి యత్నించడం సంచలనంగా మారింది. అప్పుడు తనకు ప్రాణ హాని ఉందని, ఏం జరిగినా పవన్దే బాధ్యత అని పోసాని మీడియా ముందు వ్యాఖ్యానించారు. తాజాగా పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అమీర్పేట్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు రాళ్లు విసిరారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోసాని ఇంటి వాచ్మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. గత ఎనిమిది నెలలుగా పోసాని కుటుంబం అక్కడ ఉండటం లేదు. వేరే చోట నివాసముంటున్నారు. ఘటనపై పోసాని వాచ్మెన్ సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంమైంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Crow Attack on Drone Viral Video: డ్రోన్ పై దాడిచేసిన కాకి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..