డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లో 2 కొత్త పథకాలు
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ.. వారి కుటుంబానికి అండగా నిలిచేలా మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది. పిల్లల విద్యా ఖర్చుల కోసం "ఎన్టీఆర్ విద్యాలక్ష్మి".. ఆడబిడ్డల వివాహాల కోసం "ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి" పథకాలను త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాలకు ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఇవి వాయిదా పడ్డాయని.. మరో పది రోజుల్లో అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు పథకాలు ఎవరికి వర్తిస్తాయి అనే విషయానికి వస్తే.. ప్రత్యేకంగా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు వర్తిస్తాయి. అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారికి మాత్రమే వీటిని పొందే అర్హత ఉంటుంది. పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళ గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం రుణ సాయం పొందవచ్చు. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు అవసరాన్ని బట్టి రుణం లభిస్తుంది. ఈ రుణాలకు కేవలం 4 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాలలో రుణం తిరిగి చెల్లించాలి. విద్యా రుణం కోసం అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు, విద్యాసంస్థ వివరాలు సమర్పించాలి. దరఖాస్తు చేసిన 48 గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూత అందిస్తుంది. ఈ పజతకం కింద రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 4 శాతం ఉంటుంది..అలాగే గరిష్ఠంగా 48 వాయిదాలలో రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణం పొందేందుకు లగ్నపత్రిక, వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి. వివరాల పరిశీలన అనంతరం, వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుంది. ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరం రూ.2000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో 50 శాతం డ్వాక్రా సంఘాల బలోపేతానికి వినియోగిస్తారు. మిగిలిన 50 శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించనున్నారు. అంతే కాకుండా ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తూ ప్రమాదంలో మరణిస్తే.. ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేడీలు వేసి..గొడ్డు మాంసం పెట్టి.. 73 ఏళ్ల మహిళ కన్నీటి పర్యంతం
వెనక్కి వెళ్లిన అంతర్వేది సముద్రం.. భయాందోళనలో స్థానికులు
మోగిన ఎన్నికల నగారా.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
