రైల్వే శాఖ సంచలన నిర్ణయం..ఇకపై వారికి నో ఎంట్రీ!

Updated on: Mar 17, 2025 | 7:27 AM

ఇండియన్‌ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 రైల్వే స్టేషన్లలో విమానాశ్రయం లాంటి భద్రత, రద్దీ నియంత్రణకు తగిన ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకురానుంది. ప్రస్తుతం టికెట్‌ ఉన్నవారినీ, లేనివారినీ, జనరల్‌ టికెట్‌తో ప్రయాణించే అందరు ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇకపై అలా జరిగదంటున్నారు రైల్వే అధికారులు.

రైల్వే బోర్డు ప్రకారం.. పలు రైల్వే స్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ సిస్టమ్ అమలు చేయనున్నారు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత జనరల్, వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్టేషన్‌లోకి ప్రవేశించలేరు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ విధానం దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు. రద్దీని నివారించడం, ప్రయాణికుల భద్రతను పెంచడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ విధానం త్వరలో ప్రధాన నగరాల్లోని కీలక రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు. భారతీయ రైల్వే స్టేషన్లలో సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సెలవులు, పండుగల సమయాల్లో అయితే మరింత ఎక్కువ ఉంటుంది. చాలా మంది బంధువులను దింపడానికి లేదా రిసీవ్‌ చేసుకునేందుకు రైల్వే స్టేషన్లకు వస్తారు. ఈ కొత్త నియమం అనవసరమైన రద్దీని తగ్గించి, ప్రయాణికుల కదలికను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ , కోల్‌కతాలోని హౌరా జంక్షన్ , చెన్నైలోని చెన్నై సెంట్రల్, బెంగళూరులోని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ సహా 60 అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది.

Published on: Mar 17, 2025 06:54 AM
Loading...
Unable to load recommendations.
Follow Us