బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి
గతంలో తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనను ఎండగట్టిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, బీఆర్ఎస్ పాలన కొంత మెరుగ్గా ఉండేదని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం గురించి ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినప్పటికీ..
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీవీ9 ‘క్రాస్ ఫైర్’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత బీఆర్ఎస్ పాలన కంటే దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనను ఎండగట్టిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, బీఆర్ఎస్ పాలన కొంత మెరుగ్గా ఉండేదని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం గురించి ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినప్పటికీ, ఆర్టీసీకి అవసరమైన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన పేర్కొన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా 100 రోజుల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని తాను ఎప్పుడూ అనలేదని జీవన్ రెడ్డి ఖండించారు. రాష్ట్రం అప్పుల పాలు అయిందని తాను గతంలో అన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, మేడిగడ్డ-కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జాతీయ బ్యాంకుల నుంచి నిధులు సేకరించడాన్ని దోపిడీ అనడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, దశాబ్దాలుగా పోరాడిన సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, సంజయ్ వంటి ఇతర పార్టీ నాయకులను ప్రోత్సహించడం వల్ల తలెత్తిన రాజకీయ అనివార్యతలే తాను బీఆర్ఎస్లో చేరడానికి ప్రధాన కారణమని ఆయన వివరించారు.
