చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు

Updated on: Jan 07, 2026 | 5:49 PM

జగిత్యాలలో శివసాయి టిఫిన్ సెంటర్ చట్నీలో బల్లి అవశేషాలు కలకలం సృష్టించాయి. దీనిని తిని ఎనిమిది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన హోటళ్ల ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత లేని ఆహారంపై ఫిర్యాదులున్నా నిర్లక్ష్యం ఆరోపణలున్నాయి.

ప్రతిరోజూ ఏదొక పార్టీ పేరుతో చాలామంది హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేయడం పరిపాటిగా మారింది. అయితే ప్రస్తుత కాలంలో హోటళ్లలో భోజనం చేయాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఎందుకంటే.. ఏది చూసినా కల్తీనే.. మరోవైపు ఆహారంలో పురుగులు, బొద్దింకలు వంటివి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఓ హోటల్‌లోని చట్నీలో ఏకంగా బల్లి అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది. ఇది గమనించకుండా తిన్న ఎనిమిది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలోని శివసాయి టిఫిన్ సెంటర్ సాధారణంగా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే నాణ్యమైన ఆహారం అందించడం లేదన్న ఆరోపణలు ఈ హోటల్‌పై గతంలోనే ఉన్నాయి. అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పల్లీ చట్నీలో బల్లి పడిన విషయం వెలుగులోకి వచ్చింది. చట్నీలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గమనించకుండా టిఫిన్ చేసిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. బల్లి అవశేషాల కారణంగానే వీరు అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు కూడా ధ్రువీకరించినట్లు సమాచారం. ఈ ఘటనతో హోటళ్లలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో అధికారులు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. అయితే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ల నిర్లక్ష్య వైఖరితోనే కొన్ని హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం అందించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే హోటళ్ల కిచెన్లు పరిశుభ్రంగా ఉండేలా తరచూ తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. చట్నీలో బల్లి పడిన ఆహారం తిని అనారోగ్యానికి గురైన బాధితులకు హోటల్ యాజమాన్యం తగిన నష్టపరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి హోటళ్లలో శుభ్రత, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రింటింగ్‌ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్

దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి

సర్పంచ్‌ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్‌

TTD: ఇకపై శ్రీవారి భక్తుల చెంతకే జల ప్రసాదం..

కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా