Ambati Rambabu: ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్ఫైర్లో అంబటి రాంబాబు కీలక కామెంట్స్..
ఏపీ రాజకీయాల్లో మళ్లీ కాపు అస్త్రం తెరపైకి వచ్చింది. టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనను కాపు టైగర్గా, కాపు ఛాంపియన్గా బ్రాండింగ్ చేసింది వైసీపీ కాదు.. తెలుగుదేశం పార్టీయేనంటూ ఆయన చేసిన ఆరోపణల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అనేది తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గ ఓటు బ్యాంక్ చుట్టూ జరుగుతున్న చర్చలపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ఫైర్ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న బ్రాండింగ్ వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని బయటపెట్టారు. తనను కాపు నాయకుడిగా కాపు టైగర్గా పార్టీ ఎమర్జ్ చేస్తోందా అన్న ప్రశ్నకు అంబటి తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘నేను పుట్టుకతోనే నాయకుడిని, కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇప్పటివరకు అంబటి రాంబాబు కాపులకు ఛాంపియన్ కాదు. కానీ ఇప్పుడు నాకు ఆ ఛాంపియన్షిప్ బ్రాండింగ్ ఇచ్చింది టీడీపీయే. ముఖ్యంగా టీడీపీలోని చౌదరీలే నన్ను ఆ దిశగా ప్రొజెక్ట్ చేశారు’’ అని ఆయన ఆరోపించారు. తనను కాపుల ప్రతినిధిగా చూపించే ప్రయత్నం వైఎస్సార్సీపీ చేయలేదని, ఇతర పార్టీలే ఆ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నాయని ఆయన వివరించారు.
ముద్రగడ ఎపిసోడ్.. చరిత్రను గుర్తు చేసిన అంబటి
కాపు సామాజిక వర్గం కోసం తాను చేసిన కృషిని అంబటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో ముద్రగడ పద్మనాభం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లోని హయత్ హోటల్లో కాపు నేతలందరినీ ఏకం చేసింది తానేనని గుర్తుచేశారు. ఆనాటి సమావేశానికి దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్సా సత్యనారాయణ వంటి హేమాహేమీలు హాజరయ్యారని, కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు గళం విప్పడం తన నైజమని చెప్పుకొచ్చారు. ‘‘ముద్రగడకు అన్యాయం జరిగినప్పుడు కాపులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు నాకు అన్యాయం జరిగినా, నా కుటుంబాన్ని వేధించినా అదే స్థాయిలో స్పందిస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఐక్యత చాలా తక్కువ, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
