కేంద్ర బడ్జెట్‌ వేళ.. ఈసారి నిర్మలమ్మ శారీ ప్రత్యేకత ఇదే

Updated on: Feb 02, 2026 | 12:51 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణలో ఆమె ధరించే చేనేత చీరలు, వాటి వెనుక ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యత ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తొమ్మిదేళ్లుగా వివిధ రాష్ట్రాల వస్త్రకళలను ప్రతిబింబిస్తూ, భారత చేనేతకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ఈసారి తమిళనాడు కాంచీవరం చీరను ఎంచుకున్నారు. బ్రీఫ్‌కేస్‌కు బదులుగా 'బహీ ఖాతా'ను ఉపయోగించి సంప్రదాయాన్ని నిలబెట్టారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్లో తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ వేళ ప్రజలు ఆర్థిక కేటాయింపుల పైనే కాకుండా నిర్మలమ్మ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సహజంగా చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్‌ శారీనే ఎంచుకున్నారు. బడ్జెట్‌ వేళ తన సొంత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన చారిత్రక కాంచీవరం సిల్క్ చీరను ఎంచుకున్నారు. పర్పుల్ రంగులో ఉన్న ఈ చీరపై బంగారు రంగు ‘కట్టం’, కాఫీ బ్రౌన్ బోర్డర్‌పై చేసిన సున్నితమైన వర్క్ భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పింది. కొన్ని నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమె కాంచీపురం చీరను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొమ్మిదేళ్లుగా వరుసగా బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న నిర్మలాసీతారామన్‌ ధరించిన చీరలు వివిధ రాష్ట్రాల వస్త్ర కళలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా నిలిచాయి. 2025లో బీహార్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి బహూకరించిన చేపల డిజైన్ ఉన్న మధుబని ఆర్ట్ చీరను ధరించారు. 2024లో మధ్యంతర బడ్జెట్ వేళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీలం రంగు టస్సర్ సిల్క్ ‘కాంతా’ వర్క్ చీరలో మెరిశారు. 2023 లో కర్ణాటకకు చెందిన ధార్వాడ్ కసూతి ఎంబ్రాయిడరీ, ఇల్కల్ వీవ్ ఉన్న ఎరుపు రంగు చీరను ధరించారు. 2022 లో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ ‘బొంకై’ హ్యాండ్లూమ్ చీరను ఎంచుకున్నారు. 2021 లో తెలంగాణకు చెందిన ఎరుపు, క్రీమ్ రంగుల్లో ఉన్న పోచంపల్లి ఇకత్ చీరను ధరించి మన తెలుగు నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. 2019 లో తన తొలి బడ్జెట్ ప్రసంగం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ మంగళగిరి పట్టు చీరను ధరించి సెంటిమెంట్‌ను చాటుకున్నారు. కేవలం చీరలే కాదు, బడ్జెట్ పత్రాలను మోసుకెళ్లే విధానంలోనూ ఆమె మార్పు తెచ్చారు. గతంలో ఉన్న బ్రీఫ్‌కేస్ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, ఎరుపు రంగు పట్టు వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆమె ‘డిజిటల్ బడ్జెట్’ను ప్రవేశపెడుతున్నప్పటికీ, ఆ ట్యాబ్‌ను కూడా అదే సంప్రదాయ ఎరుపు రంగు బ్యాగ్‌లో తీసుకెళ్లడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..

Published on: Feb 02, 2026 12:45 PM