రాబోయే రోజుల్లో బంగారం ధర రూ.లక్ష మార్క్‌ దాటనుందా? కారణాలు ఏంటి?

Updated on: Jan 31, 2025 | 2:03 PM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి.. అయితే.. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతానికి బంగారం ధర 82వేలు దాటేసింది.

మున్ముందు లక్షమార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలు పసిడి కొనడం ఇక కలేనా? అసలు గోల్డ్ రేట్లు అమాంతం పెరగడానికి కారణాలేంటి? స్థిరంగా ఉన్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే పసిడి ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని అందరు భావించారు. కానీ సీన్ రివర్స్‌ అయ్యింది. ట్రంప్‌ రాగానే పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్‌మార్కెట్‌లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఆర్బీఐతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి.