Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధాలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటివి ధరల పెరుగుదలకు కారణం. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లు సురక్షితమైన పెట్టుబడిగా మారాయి. ఫ్యాషన్ కోసం 9 క్యారెట్ల బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. నిపుణుల సలహా: ధరల హెచ్చుతగ్గులను గమనించి తెలివిగా పెట్టుబడి పెట్టాలి.
భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, గత కొంతకాలంగా పసిడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి సుమారు 62% పైగా ధరలు పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి, కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం లాభదాయకమేనా? నిపుణుల సూచన ఏమిటో ఇప్పుడు చూద్దాం! గతంలో బంగారం అంటే కేవలం నగల రూపంలోనే కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నగల కొనుగోలులో మేకింగ్ ఛార్జీలు , భద్రత సమస్యలు ఉండటంతో పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టే మార్గం. మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు, ఇంటి నుంచే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఇందులో చిన్న మొత్తం నుంచి పెద్దమొత్తం వరకూ కొనుగోలు చేయవచ్చు. భద్రపరచాల్సిన అవసరం లేదు, దొంగతనాల భయం ఉండదు. బంగారం ధర పెరిగితే మీ ఈటీఎఫ్ విలువ కూడా పెరుగుతుంది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మార్కెట్లో కొత్త ట్రెండ్ వచ్చింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తక్కువ క్యారెట్ల బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో 9 క్యారెట్ల బంగారం ట్రెండ్గా మారింది. గోల్డ్ స్వచ్ఛత విషయానికి వస్తే.. 24 క్యారెట్లు గోల్డ్ 99.9% స్వచ్ఛత కలిగి ఉంటుంది. 22 క్యారెట్లు బంగారం 91.7% స్వచ్చత ఉంటుంది. అలాగే 18 క్యారెట్ల బంగారంలొ 75% స్వచ్ఛత ఉంటుంది. క్యారెట్ తగ్గేకొద్దీ అందులో వెండి, రాగి వంటి లోహాలు కలుస్తాయి. ఈ 9 క్యారెట్ల గోల్డ్ కూడా అంతే. ఇప్పటివరకు 14K నుండి 24K క్యారెట్ల బంగారం వరకు మాత్రమే హాల్మార్కింగ్ ఉండేది. కానీ, సామాన్యులకు అందుబాటులో ఉండేలా 9 క్యారెట్ల బంగారానికి కూడా హాల్మార్కింగ్ వేయాలని కేంద్రం ఆదేశించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు లక్ష దాటితే, 9K బంగారం సుమారు రూ. 37 వేలకే లభిస్తుంది. దీంతో ఫ్యాషన్ జ్యువెలరీ కోసం దీనికి డిమాండ్ పెరుగుతోంది. బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పరిస్థితులు మరియు ట్రంప్ వాణిజ్య సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. భారత్ సహా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారీగా బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 43 టన్నుల బంగారాన్ని కొన్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధర భారత్లో మరింత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2.30 లక్షల కోట్లు ఈటీఎఫ్లలో పెట్టుబడిగా వచ్చాయి. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయుల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ దాదాపు రూ. 3.34 కోట్ల కోట్లు. అంటే మన దేశ జీడీపీలో ఇది 88.8 శాతం! అటు ఆర్బీఐ వద్ద కూడా 880 టన్నుల నిల్వలు ఉన్నాయి. దేశంలో ‘గోల్డ్ లోన్స్’ పెరగడం వల్ల, ఈ బంగారం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడిగా వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. గోల్డ్మన్ సాక్స్ అంచనా ప్రకారం, 2026 జూన్ నాటికి బంగారం ధరలు మరో 6 శాతం పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరుగుతున్నా, భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ తగ్గకపోవడమే దీనికి ప్రధాన కారణం. పెట్టుబడి పరంగా చూస్తే డిజిటల్ గోల్డ్, వాడకం పరంగా చూస్తే తక్కువ క్యారెట్ నగలు ప్రస్తుత మార్కెట్ సూత్రాలుగా మారాయి. బంగారం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఆర్థిక స్థిరత్వానికి చిహ్నం. ధరల హెచ్చుతగ్గులను గమనిస్తూ, తెలివిగా పెట్టుబడి పెట్టడమే ప్రస్తుత కాలంలో సరైన వ్యూహం అంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు
Divvala Madhuri: ‘ఇలా అయితే రాజకీయాలు కష్టం’ త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్
Thalapathy Vijay: చదువు అంతంత మాత్రమే.. కానీ పట్టుదల కొండంత
Chiranjeevi: అప్పట్లో విజయ్ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే
Rajinikanth: ‘పీక్ క్రేజ్ వేస్టెడ్ తాత’ అంటూ రజినీ పై ట్రోల్స్
