ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..

Updated on: Feb 15, 2025 | 9:06 PM

ప్రపంచ కుబేరుడు, ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఓపెన్‌ఏఐ పై ఫోకస్‌ పెట్టారు. కొంతకాలంగా మస్క్‌ ఈ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటిది తాజాగా మస్క్‌ ఓపెన్‌ ఏఐని కొనుగోలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం ఓ భారీ ఆఫర్‌ కూడా ప్రకటించారు. ఓపెన్‌ఏఐ ని 97.4 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.5లక్షల కోట్లకు కొనుగోలు చేస్తామంటూ మస్క్‌ సహా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రకటించారు.

అయితే ఈ ఆఫర్‌ను ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ బహిరంగంగానే తిరస్కరించారు. దానికి ప్రతిగా అవసరమైతే ‘ఎక్స్‌’నే కొనుగోలు చేస్తానంటూ మస్క్‌కు సవాల్‌ విసిరారు. ‘‘మీ ఆఫర్‌కు నో. కానీ, మీరు కోరుకుంటే ట్విటర్‌ను 9.74 బిలియన్‌ డాలర్లకు అంటే దాదాపు రూ.85వేల కోట్లకు మేమేకొనుగోలు చేస్తాం’’ అంటూ ఆల్ట్‌మన్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు.