శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్ర శుభవేళ ఇంద్రకీలాద్రిలో కొలువుదీరిన కనకదుర్గకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం దగ్గర ఆయనకు సంప్రదాయబద్ధంగా పరివేష్టం చుట్టారు. ఆ తర్వాత వెండి పళ్లెంలో అమ్మవారి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ తీసుకొని సీఎం గర్భగుడికి చేరుకున్నారు.
సరస్వతి దేవీరూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తీర్థప్రసాదాలను సీఎం స్వీకరించారు. ఆలయ సందర్శన సందర్భంగా సీఎంకు అమ్మవారి వస్త్రాన్ని, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు చేసిన పెన్నులను కూడా సీఎం అందించారు. ఆలయ పూజారులు వేదమంత్రాలతో సీఎంను ఆశీర్వదించారు.
సీఎం జగన్ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం సమయంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, వనిత, జోగి రమేష్, విజయవాడ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఉన్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయం