అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం, ఒకే రోజు 2,500 వేల మంది మరణం.
కరోనా కాలంలో గుంపులు గుంపులుగా ఉండటం మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు కొందరు.. ఫలితంగానే కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.. అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరాళనృత్యం చేస్తోంది..
కరోనా కాలంలో గుంపులు గుంపులుగా ఉండటం మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు కొందరు.. ఫలితంగానే కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.. అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరాళనృత్యం చేస్తోంది.. గడచిన 24 గంటలలో అక్కడ రెండున్నరవేల మంది కరోనా కారణంగా చనిపోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. ఏప్రిల్ తర్వాత అమెరికాలో ఒక్క రోజులో ఇంతమంది మరణించడం ఇదే ప్రథమం.. 1,80,000 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా వైరస్ను అదుపులోకి తేవడానికి అమెరికా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం రావడం లేదు.. ప్రజలు కూడా కరోనాను తేలిగ్గా తీసుకుంటున్నారు.. నిజానికి అమెరికాలో ఇది పండుగల సీజన్.. క్రిస్మస్ పర్వదినం దగ్గరకొచ్చింది.. జనమంతా షాపింగ్ సందడిలో పడిపోయారు.. బంధుమిత్రులను కలుసుకునేందుకు ప్రయాణాలు కూడా చేస్తున్నారు.. కరోనా వైరస్ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. సామూహిక ఉత్సవాలలో పాల్గొంటున్నారు.. పర్యవసానంగా రాబోయే రోజులలో కరోనా వ్యాప్తి మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజుకు కనీసం రెండు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 1.37 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2,70,000 మంది చనిపోయారు. ఇదిలా ఉంటే అమెరికాలో వ్యాక్సిన్ను అందుబాటులో తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా అత్యవసర పరిస్థితి కింద టీకాకు అనుమతి ఇవ్వాలంటూ ఫైజర్ సంస్థ అమెరికా ప్రభుత్వానికి విన్నవించుకుంది.. ఈ విజ్ఞాపనపై ఈ నెల పదిన నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం ఫైజర్కు అనుకూలంగా ఉంటే మాత్రం డిసెంబర్ 11 నుంచే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి జరుగుతుంది..