జీహెచ్ఎంసీ మేయర్ పీఠం తమదేనంటున్న టీఆర్ఎస్, హాఫ్ సెంచరీ దాటి తీరతామంటున్న బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ ముగిసింది.. ఇప్పుడు రాజకీయపార్టీలు లెక్కలేసుకోవడంలో బిజీ అయ్యాయి.. ఎవరికివారు గెలుపు మీద కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.. గ్రేటర్ మేయర్ పీఠం మళ్లీ తమకే దక్కుతుందని అధికార టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే వస్తోంది..
గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ ముగిసింది.. ఇప్పుడు రాజకీయపార్టీలు లెక్కలేసుకోవడంలో బిజీ అయ్యాయి.. ఎవరికివారు గెలుపు మీద కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.. గ్రేటర్ మేయర్ పీఠం మళ్లీ తమకే దక్కుతుందని అధికార టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే వస్తోంది.. లాస్ట్ టైమ్ ఒక్క సీట్తో మిస్సయ్యింది కానీ ఈసారి మాత్రం సెంచరీ కొట్టడం గ్యారంటీ అని కాన్ఫెడెన్స్గా అంటోంది.. పోలింగ్ సరళి చూస్తే తాము చెప్పేది నిజం అవుతుందన్న నమ్మకం కలిగిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వంద శాతం వంద సీట్లు గెలుస్తామని గులాబీ శిబిరం చెబుతోంది.. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు అధికారపార్టీకి అగ్నిపరీక్షలాంటిది.. ఈ ఎన్నికలు రిఫరెండం కాకపోవచ్చు కానీ అయిదేళ్ల గ్రేటర్ పాలన పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉందో… ఓవరాల్గా ఏడేళ్ల పాలన గురించి ఏమనుకుంటున్నారో ఈ ఎన్నికల ఫలితాలు చెప్పబోతున్నాయి. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారనీ, గతంలోలాగే వంద డివిజన్లలో గెలవడం ఖాయమనే అంచనాలో టీఆర్ఎస్ ఉంది.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.. పార్టీ అభ్యర్థులు, డివిజన్ ఇన్ఛార్జ్లతో పోలింగ్ తీరుతెన్నులపై సమీక్ష జరిపిన తర్వాత కేటీఆర్ ఓ స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. డివిజన్ల వారీగా పరిస్థితిని తెలుసుకున్నారు. బీజేపీ గట్టి పోటీనిస్తుందనుకుంటున్న డివిజన్లలో పోలింగ్ ఎలా జరిగిందో వాకబు చేశారు.. పార్టీకి పట్టున్న బస్తీలు, కాలనీలలో పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకున్నారు. పోల్ అయిన ఓట్లలో మెజారిటీ ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయని ఓవరాల్గా లెక్కలేసుకున్న తర్వాత గులాబీ నేతలు అంటున్నారు.
భారతీయ జనతాపార్టీ కూడా విజయంపై కాన్ఫిడెంట్గానే ఉంది.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేస్తామని బల్లగుద్ది మరీ చెబుతోంది బీజేపీ.. మెజారిటీ స్థానాలు తమకే దక్కుతాయని కమలనాథులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలించే అంశమని, హాఫ్ సెంచరీకి పైగా డివిజన్లు సాధిస్తామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ వాసులంతా తమవైపే నిలిచారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం తగ్గడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపిస్తున్న బీజేపీ అయినప్పటికీ పోలైన ఓట్లు తమకే పడ్డాయని పేర్కొంది. టీఆర్ఎస్తో విసిగి వేసారిపోయిన ప్రజలు బ్యాలెట్ బాక్సులలో తమ అసంతృప్తిని చాటుకున్నారని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ అధినాయకత్వానికి కనువిప్పు కాబోతున్నదని అంటున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.. అందుకే ప్రచారానికి కేంద్రమంత్రులను, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కీలక నేతలను తీసుకొచ్చింది..కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అయితే విస్తృతంగా ప్రచారం చేశారు.. ఇక పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, అరవింద్, డీకే అరుణ, లక్ష్మణ్లు కూడా తీవ్రంగా శ్రమించారు. అయితే పోలింగ్ శాతం తగ్గడం కాసింత కలవరం కలిగిస్తోంది. పోలింగ్ శాతం తగ్గడం తమకు లాభిస్తుందా లేక అధికారపార్టీకి కలిసివస్తుందా అన్న టెన్షన్లో నేతలు ఉన్నారు. ఓటు వేసేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపకపోవడం, చదువుకున్నవారు కూడా పోలింగ్బూత్ల వరకు రాకపోవడం తమకు నష్టం కలిగిస్తాయేమోనని బీజేపీ ఆందోళన చెందుతుంది.
కాంగ్రెస్పార్టీ కూడా గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ బలం బాగా పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కనీసం 20 డివిజన్లు గెలుస్తామని, మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో తమకు మంచి రిజల్ట్స్ వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత తాము పదిహేను నుంచి ఇరవై డివిజన్లు గ్యారంటీగా గెలుస్తామని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. కనీసం 65 డివిజన్లలో గట్టిపోటీనిచ్చామని హస్తం నేతలు అంటున్నారు. మజ్లిస్ పార్టీకి ఎలాంటి టెన్షనూ లేదు.. తమ స్థానాలను తాము నిలబెట్టుకుంటామని, ఒకట్రెండు డివిజన్లను అధికంగా కూడా గెల్చుకుంటామని ఎంఐఎం నేతలు అంటున్నారు. ఈసారి తాము కింగ్ మేకర్లకు కావడం ఖాయమని చెబుతున్నారు.. మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నవారెవరైనా తమ సహకారం తీసుకోక తప్పదని చెబుతున్నారు. పాతబస్తీపై తమ పట్టు ఏమాత్రం చేజారలేదని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయబోతున్నాయని దారుస్సలాం వర్గాలు అంటున్నాయి. ఇక 29 డివిజన్లలో పోటీ చేసిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకున్నాయి.. ఏమో గుర్రం ఎగిరినా ఎగురుతుందన్న నమ్మకం వారిది.. తెలంగాణ జనసమితి కూడా ఇదే నమ్మకంతో ఉంది.. పోటీ చేసిన 26 చోట్ల ప్రత్యర్థులకు గట్టిపోటీనివ్వగలిగామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులలతో కూడా ధీమా ఏమాత్రం సడలడం లేదు..