
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఒక బావిలోని నీరు విచిత్రంగా ఎగిసిపడుతూ తరంగాల రూపంలో కదులుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చేదబావిలో నీరు దానంతట అదే నిరంతరం ఎగిసిపడుతూ అలల్లా కదులుతుండటం తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించింది. ఈ విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు దీనిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే నీటిలోని ఈ హఠాత్ కదలికల వల్ల స్థానికుల్లో భూకంపం ఏమైనా వస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, నిపుణులు వెంటనే పరిస్థితిని సమీక్షించారు. గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) పరిశోధకులు మోర్బీ ప్రాంతంలో ఎలాంటి భూకంప సంకేతాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఇది భూకంపాల వల్ల జరుగుతున్న ప్రక్రియ కాదని, ప్రకృతిలో సహజంగా జరిగే శాస్త్రీయ దృగ్విషయమని వారు తెలిపారు.
ఇటీవల ఈ ప్రాంతంలో, ఎగువన భారీ వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాలు అనూహ్య రీతిలో, అత్యంత వేగంగా రీఛార్జ్ అయ్యాయి. భూగర్భంలో భారీగా నీరు చేరినప్పుడు, అక్కడ ఉన్న రాతి పొరలు, రంధ్రాల మధ్య చిక్కుకున్న గాలిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ గాలి బయటకు రావడానికి మార్గం వెతుక్కునే క్రమంలో నీటిని పైకి తోస్తుంది. బావి దిగువ భాగం నుండి వస్తున్న ఈ గాలి, నీటి ఒత్తిడి వల్ల నీరు ఉపరితలంపై తీవ్ర అలజడి సృష్టిస్తూ ఎగిసిపడుతోంది.
ఈ మేరకు.. మోర్బీ జిల్లా యంత్రాంగం ప్రజలు ఎలాంటి పుకార్లను, మూఢనమ్మకాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. నిపుణుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఇది కేవలం భూగర్భ జలాల రీఛార్జ్, గాలి ఒత్తిడి వల్ల జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని ధృవీకరించడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..