
57 ఏళ్ల ఒక జర్మన్ పర్యాటకుడు ఈజిప్టులోని రెడ్ సీ రిసార్ట్లో విహారయాత్రకు వెళ్లారు. అందమైన లోయలు, ఎత్తైన పిరమిడ్లను సందర్శిస్తున్నాడు. తన హాలిడే ప్యాకేజీ తనకు చివరి పర్యటన అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆ విలాసవంతమైన రిసార్ట్లో స్నేక్ షో జరుగుతున్నప్పుడు, ప్రేక్షకులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అక్కడ పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన స్నేక్ షోను చూస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. షో మధ్యలో ఆ పాములవాడు పాములను ప్రేక్షకులకు చాలా దగ్గరగా తీసుకువస్తున్నాడు. ఇది అక్కడ ఒక సాధారణ పద్ధతి. ఇంతలో, ఒక విషపూరితమైన నాగుపాము పాములవాడి చేతిలోంచి జారి నేరుగా ఆ జర్మన్ పర్యాటకుని ప్యాంటులోకి దూరింది. ఎవరైనా స్పందించి దాన్ని బయటకు లాగేలోపే, ఆగ్రహించిన ఆ పాము ఆ వ్యక్తి కాలిని చాలా బలంగా కాటు వేసింది. విషం క్షణాల్లో ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఆ పర్యాటకుని పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది.
నాగుపాము విషం అత్యంత వేగంగా పని చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రిసార్ట్ సిబ్బంది వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, విషం గుండె, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
సాధారణంగా పర్యాటక ప్రదర్శనల్లో ఉపయోగించే పాముల విషపు కోరలను తొలగిస్తారని అందరూ నమ్ముతారు. కానీ ఈ ఘటనలో పాముకు విషం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రదర్శనకు అనుమతులు ఉన్నాయా? నిర్వాహకులు తగిన భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పర్యాటక కేంద్రాల్లో జంతువులతో చేసే ఇలాంటి ప్రదర్శనలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
విదేశీ పర్యాటక ప్రాంతాల్లో సాహస కృత్యాలు లేదా జంతువులతో కూడిన షోలు చూసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విషపూరితమైన జంతువులతో నిర్వహించే ప్రదర్శనలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఈ విషాద వార్త ప్రస్తుతం అంతర్జాతీయ పర్యాటక రంగంలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…