
పొన్నేరి, మే 21: తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో దాదాపు 30కిపై గ్రామాలకు చెందిన జాలరులు పోన్పే సరస్సులో, సముద్రంలో చేపలు పడుతుంటారు. పొన్నేరు సమీపం పళవేర్కాడు పాసియావరానికి చెందిన జాలరి దైవప్రకాశం నలుగురితో కలిసి పడవలో అక్కడి సముద్రంలో మంగళవారం సాయంత్రం ఎప్పటిమాదిరిగానే చేపలు పట్టేందుకు వల విసిరాడు. ఇంతలో వారి వల భారీగా బరువెక్కింది. దండిగా చేపలు పడి ఉంటాయని ఆశతో వలను బయటకు లాగారు. అయితే వలలో చేపలకు బదులు సుమారు 10 కిలోల బరువైన తుప్పుపట్టిన ఇనుపగోళం వంటి వింత వస్తువు ఒకటి కనిపించింది. దాన్ని చూసి జాలర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
TG EAPCET 2026 Counselling: ఈసారి ఈఏపీసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యం.. అదే కారణమా?
దాన్ని ఒడ్డుకు చేర్చి మత్స్యకారులు వెంటనే తిరుప్పలైవనం పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ రహస్య వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు నిపుణుల సహాయంతో పోలీసులు ఆ రహస్య వస్తువును పరిశీలించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది రిహార్సల్లో ఉపయోగించిన బాంబా లేక రాకెట్ లాంచర్ వంటి పేలుడు పదార్థమా లేదా ఏదైనా నౌకాదళ నౌక నుంచి జారి పడిందా? లేదా విధ్వంసం కోసం ఉద్దేశించిన పేలుడు పదార్థమా? వంటి పలు కోణాల్లో పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.
అది ఫిరంగిలో ఉపయోగించే బాంబు అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకవేళ అది బాంబు అయితే నిపుణులు దానిని నిర్వీర్యం చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆ వస్తువును పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక సురక్షిత ప్రదేశంలో ఉంచారు. మత్స్యకారుడి వలలో చిక్కిన ఈ బాంబు లాంటి రహస్య వస్తువు స్థానికంగా కలకలం రేపింది.