Mahendra Giri: ఇక్కడికి వెళ్తే.. ఒక్క రోజులోనే ఆరు రుతువుల్ని ఆస్వాదించవచ్చట..

ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతం సముద్ర గర్భం నుండి ఉదయించే సూర్యుని దృశ్యానికి ప్రసిద్ధి. ఇది అరుదైన జీవవైవిధ్యం, వేల ఔషధ మొక్కలకు నిలయం. ఒకే రోజులో ఆరు రుతువుల వాతావరణాన్ని అనుభవించే ప్రత్యేకత మహేంద్రగిరికి ఉంది. ఈ పర్వతంపై గడిపితే రోగాలు తగ్గుతాయని స్థానికుల నమ్మకం.

Mahendra Giri: ఇక్కడికి వెళ్తే.. ఒక్క రోజులోనే ఆరు రుతువుల్ని ఆస్వాదించవచ్చట..
Mahendragiri

Updated on: May 24, 2026 | 7:26 PM

ఒడిశాలోని గజపతి జిల్లాలో నెలకొన్న మహేంద్రగిరి పర్వతం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, అరుదైన జీవవైవిధ్యానికి నెలవు. సముద్ర మట్టానికి 4,925 అడుగుల ఎత్తున ఉన్న ఈ పర్వతం, ఒడిశాలో డియోమాలి తర్వాత రెండవ ఎత్తైన పర్వతం. ఇక్కడికి చేరుకునే మార్గమంతా సెలయేళ్లు, జలపాతాలు, పచ్చని కొండల గుండా సాగి, కనుల పండుగ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలోనూ, బారువా తీరంలో బంగాళాఖాతంలోనూ కలిసే నీటి వనరులకు ఈ పర్వతం మూలం. మహేంద్రగిరిపై ఉదయించే సూర్యుడి దృశ్యం అత్యంత అద్భుతమైనది. సూర్యుడు సముద్ర గర్భం నుంచి పుట్టినట్లు కనిపించే ఈ దృశ్యాన్ని చూసేందుకు ఒడిశా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి పర్యాటకులు తండోపతండాలుగా వస్తారు. ఈ దృశ్యాన్ని వీక్షించడానికి చాలా మంది పర్యాటకులు ముందు రోజు రాత్రే గుడారాలు వేసుకుని బస చేస్తారు.

భీముని కొండపైకి ఎక్కి సముద్ర మట్టానికి చూస్తే, ఉదయించే సూర్యుడు సముద్రం లోపల నుంచి వస్తున్నట్లు కనిపించడం యాత్రికులను తన్మయత్వానికి గురి చేస్తుంది. ఈ పర్వతంపై ధర్మరాజు, భీముడు, కుంతీ, ద్రౌపది ఆలయాలు ఉన్నాయి. భీముడి ఆలయం ఐదు భారీ రాళ్లతో నిర్మితమైంది, లోపల శివలింగం ఉంటుంది. శివరాత్రి పర్వదినాన దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడి శివాలయానికి కాలి నడకన చేరుకుంటారు. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా, పొగమంచుతో, మేఘాలు పాదాల చెంతకు వచ్చే విధంగా ఉంటుంది. మహేంద్రగిరి అరుదైన జీవజాలానికి, వృక్ష సంపదకు ప్రసిద్ధి. మహేంద్రగిరి సంస్కృతి వికాస సమితి సభ్యుల ప్రకారం, ఈ పర్వతం వెయ్యికి పైగా జాతులకు చెందిన మొక్కలకు నిలయం. ఒడిశా జీవ వైవిధ్య మండలి అధ్యయనం… ఒడిశాలోని మొత్తం వృక్ష జాతులలో 40 శాతం మహేంద్రగిరి కొండల పైనే ఉన్నాయని తేల్చింది. ఇక్కడ వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి, వాటిలో అనేక అరుదైన ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. ఇటువంటి వృక్ష, ఫల సంపద దేశంలో మరెక్కడా ఉండదని చెబుతారు. మహేంద్రగిరికి ఉన్న మరో ప్రత్యేకత.. అక్కడి వాతావరణం. ఒకే రోజులో ఆరు రుతువులను అనుభవించే విధంగా ఇక్కడి వాతావరణం ఉంటుంది, ఇది భారతదేశంలో మరెక్కడా కనిపించని ప్రత్యేకత. ఇక్కడి మొక్కలు, వృక్షాలు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో, ఇక్కడ కొన్ని రోజులు గడిపినట్లయితే రోగాలు తగ్గుతాయని స్థానికుల నమ్మకం. ప్రకృతి సౌందర్యాన్ని, ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని కోరుకునే వారికి మహేంద్రగిరి ఒక అద్భుతమైన గమ్యస్థానం.

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు.. 

 

Follow Us