
ఇప్పటివరకు ఒక్కో బంగారు నగపై ఉన్న రూ. 45 హాల్మార్కింగ్ ఛార్జీని ఇప్పుడు రూ. 75కి పెంచారు. దీనివల్ల ప్రతి నగపై నేరుగా రూ. 30 అదనపు భారం పడనుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ హాల్మార్కింగ్ నిబంధనలను సవరించగా, షెడ్యూల్ 4 కింద జ్యువెలర్లు ఒక్కో ఆర్టికల్కి రూ. 75 చొప్పున గుర్తింపు పొందిన అసేయింగ్–హాల్మార్కింగ్ సెంటర్లకు (ఏహెచ్సీ) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దుకాణదారులు లేదా తయారీదారులు బంగారు నగలకు ఒక్కో కన్సైన్మెంట్ బ్యాచ్కు రూ. 200 , వెండి ఆర్టీకల్స్కు కనీసం రూ. 150గా చెల్లించాలి. దీంతో వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరిగి, ఈ రూ. 30 అదనపు భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపే అవకాశం ఉంది.
గొలుసులు, గాజులు, నెక్లెస్ల వంటి పెద్ద ఆభరణాలతో పోలిస్తే రూ. 30 పెద్ద మొత్తంగా అనిపించదు. కానీ, రింగులు, కమ్మలు, చిన్న నాణేలు వంటి తక్కువ బరువు ఉండే వస్తువులపై మాత్రం కొద్దిగా అదనపు భారం పడుతుంది. ఈ ఛార్జీల పెంపు ద్వారా వచ్చే డబ్బును హాల్మార్కింగ్ కేంద్రాల మౌలిక వసతులు, నాణ్యతా ప్రమాణాల తనిఖీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తామని బీఐఎస్ (BIS) తెలిపింది. పండగల షాపింగ్ సమయంలో బంగారం ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇది బంగారపు స్వచ్ఛత పరంగా వినియోగదారులకు భరోసానిస్తుంది.
అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (GJC) ఈ ఛార్జీల పెంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా 67% మేర ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందనే దానిపై పరిశ్రమకు స్పష్టత కావాలని డిమాండ్ చేసింది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపి, తక్షణమే ఈ పెంపు నిర్ణయాన్ని సమీక్షించాలని పాత ఛార్జీలనే కొనసాగించాలని జీజేసీ చైర్మన్ రాజేశ్ రోక్డే కోరారు.
అయితే వెండి హాల్మార్కింగ్ ఛార్జీలలో ఎలాంటి మార్పు చేయలేదు. వెండి ఆభరణాలపై పాత పద్ధతిలోనే కేవలం రూ. 35 ఛార్జీని కొనసాగించి వెండి కొనుగోలుదారులకు ఊరటనిచ్చారు.