
అడవిలో జీవవైవిధ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అటవీ అధికారి ఒకరు వివరించారు. పులి వేటాడే విధానం నుంచి, అది వదిలేసిన ఆహారాన్ని ఇతర జంతువులు ఎలా తింటాయి, అడవిని శుభ్రంగా ఉంచడంలో రాబందుల పాత్ర ఎంత కీలకమో వెల్లడించారు. పులి తన ఆహారం కోసం వేటాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఏదైనా జంతువును వేటాడేటప్పుడు దానికి గాయాలు కాకుండా చూసుకుంటుంది. ఒకవేళ పులికి గాయమైతే అడవిలో చికిత్స చేసేవారు ఉండరు కాబట్టి, అది చాకచక్యంగా జంతువు గొంతును పట్టుకుని శ్వాస ఆడకుండా చేసి చంపుతుంది.
పులి వేటాడిన తర్వాత మొదట వెనుక భాగం నుంచి మాంసాన్ని తినడం ప్రారంభిస్తుంది. పులి కేవలం మాంసాన్ని మాత్రమే తింటుంది. పొట్ట, పేగులను వదిలేస్తుంది. ఒకసారి వేటాడితే సుమారు 20 కిలోల వరకు మాంసం తిని, మిగిలిన దాన్ని తర్వాత తినడానికి మళ్ళీ వస్తుంది. పులి తిని వదిలేసిన ఆహారాన్ని అడవి కుక్కలు, నక్కలు, చిరుత పులులు తింటాయి. జంతువులు తిని వదిలేసిన ఎముకలను హైనాలు తింటాయి. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. అడవిలో చనిపోయిన జంతువులను లేదా మిగిలిపోయిన మాంసం ముక్కలను రాబందులు తింటాయి. వీటిని ప్రకృతిలోని స్కావెంజర్స్ అంటారు. ఇవి కుళ్ళిపోయిన మాంసాన్ని తిన్నా జీర్ణం చేసుకోగలవు. ఆంత్రాక్స్ వంటి ప్రమాదకర వ్యాధులు ఉన్న మాంసాన్ని తిన్నా వీటికి ఏమీ కాదు. అడవిలో పులి ఉండటానికి మూడు ప్రధాన అవసరాలు ఉంటాయి.
ఆవాసం: మనుషుల డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైన నివాసం.
ఆహారం: సరిపడా జింకలు, దుప్పులు వంటి ఆహార జంతువులు.
నీరు: తాగడానికి నీటి వసతి.
ఈ మూడు ఉంటే పులి ఆ ప్రాంతంలో స్థిరంగా ఉంటుంది. పులులకు వినే, చూసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషుల కంటే ఆరు రెట్లు ఎక్కువగా పులులు చూడగలవు. అడవిలోకి ఎవరైనా వస్తున్నారంటే వాటి సెన్సెస్ ద్వారా చాలా వేగంగా కనిపెడతాయి. సాధారణంగా పులులు మనుషులను చూస్తే భయపడి పారిపోతాయి. అవి చాలా సిగ్గుపడే జంతువులు అని అధికారి పేర్కొన్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..