
బుధవారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి సాయంత్రం 17:30 గంటలకు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరాన్ని దాటింది. తదుపరి ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశలో కదిలి బలహీనపడి అల్పపీడనంగా మారి ఈరోజు ఉదయం 05:30 గంటలకు ఉత్తర తమిళనాడు దాని సమీపంలోని దక్షిణ అంతర్గత కర్నాటక ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం ఇంచుమించు అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాక ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ ఎత్తువరకు కొనసాగుతోంది.
రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశలో దక్షిణ కర్ణాటక మీదుగా కదిలి ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. నిన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 5.8 కి మీ ఎత్తువరకు చేరుకుంది. దీని ప్రభావంతో శుక్రవారం 24 అక్టోబర్, 2025, నాటికి ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.
ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలుల కూడా వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.