
తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చే వార్త చెప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటం, భానుడి భగభగలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో కాలేజీల వేసవి సెలవులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రస్తుత తీవ్రమైన ఎండల దృష్ట్యా సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగించారు.
రాష్ట్రంలోని ప్రముఖ సాంప్రదాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని క్యాంపస్, కాన్స్టిట్యుయెంట్ (అనుబంధ), అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికీ ఈ పొడిగించిన సెలవులు వర్తిస్తాయి. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు: ఈ మూడు విశ్వవిద్యాలయాలు జూన్ 6 వరకు సెలవులను పొడిగిస్తూ అధికారిక సర్క్యులర్ జారీ చేశాయి. ఈ కాలేజీలు మళ్లీ జూన్ 8 (సోమవారం) నాడు పునఃప్రారంభం కానున్నాయి.
కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగించాయి. ఇవి తిరిగి జూన్ 6 నుంచే ఓపెన్ కానున్నాయి.
విద్యార్థులకు, సాధారణ ఫ్యాకల్టీకి సెలవులు పొడిగించినప్పటికీ.. కాలేజీల ప్రిన్సిపాల్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో ఉన్న అధ్యాపకులు మాత్రం యధావిధిగా విధులకు హాజరుకావాలని యూనివర్సిటీలు స్పష్టం చేశాయి. కాలేజీల అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పనులను సజావుగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం.. డిగ్రీ కాలేజీలకు ఏటా 10 వారాల పాటు వేసవి సెలవులు ఇచ్చేందుకు అర్హత ఉంటుందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కొలీజియట్ ఎడ్యుకేషన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కాదరు సురేందర్ రెడ్డి తెలిపారు. అయితే, రాష్ట్రంలోని యూనివర్సిటీలు మొదట మే 1 నుంచి మే 31 వరకు మాత్రమే సెలవులు ప్రకటించాయని, ఇప్పుడు పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకున్న సెలవుల పొడిగింపు నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
మొత్తానికి ఎండల తీవ్రత తగ్గకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. సమ్మర్ హాలీడేస్ పొడిగింపు..