CM KCR: పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమమే: సీఎం కేసీఆర్
CM KCR Irrigation Review: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న పరిస్థితుల్లో నీటిపారుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం..
CM KCR Irrigation Review: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న పరిస్థితుల్లో నీటిపారుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇరుగేషన్ అధికారులతోపాటు, వివిధ శాఖ ముఖ్య ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్తో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాలయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమమేనని అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్టుగా ఏపీ గుర్తించడం లేదని, పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఈనెల 9న నిర్వహించే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను ఎజెండాలో చేర్చాలని, కృష్ణా బోర్డు సమావేశంలో తమ వాదన వినిపిస్తామని కేసీఆర్ తెలిపారు. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంత కాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని కేసీఆర్ అన్నారు. జల విద్యుత్కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు.
ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి:
కృష్ణా నీటిని సముద్రంలోకి వృథా చేస్తున్నారనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటినే శ్రీశైలం ప్రాజెక్టులో వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీశైలం డ్యాం దగ్గరికి ప్రాజెక్టు ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వాలతో చెరువులు, కుంటలు నింపాలని నిర్ణయించారు. కృష్ణా నీటిలో రెండు రాష్ట్రాలకు 811 టీఎంసీల నికర జలాలు కేటాయించారని, ఏపీ తెలంగాణ 405.5 టీఎంసీలు వాడుకోవాలన్నారు.